ఇండోర్‌కు ఐదోసారి స్వచ్ఛతా పురస్కారం

ABN , First Publish Date - 2021-11-20T20:15:55+05:30 IST

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ వరుసగా ఐదోసారి

ఇండోర్‌కు ఐదోసారి స్వచ్ఛతా పురస్కారం

న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ వరుసగా ఐదోసారి దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా నిలిచింది. స్వచ్ఛ్ సర్వేక్షణ్, 2021 నివేదికలో మొదటి మూడు స్థానాల్లో వరుసగా ఇండోర్, సూరత్, విజయవాడ నగరాలు నిలిచాయి. పరిశుభ్రమైన గంగా పరీవాహక నగరంగా వారణాసి, పరిశుభ్రమైన రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సర్వేను నిర్వహించింది. 


విజ్ఞాన్ భవన్‌లో శనివారం ఈ మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఈ నగరాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పురస్కారాలను ప్రదానం చేశారు.  కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ఇండోర్ భారత దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఐదో సంవత్సరం నిలిచిందని తెలిపారు. ఈ నగరంలోని ప్రజలు, రాజకీయ నాయకత్వం, నగర పాలక సంస్థ, స్వచ్ఛాగ్రహీలు, పారిశుద్ధ్య కార్మికులు అసాధారణమైన అంకితభావంతో ఈ నగరాన్ని అగ్ర శ్రేణిలో నిలిపారని ప్రశంసించారు. 


దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌‌కు పురస్కారం లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఈ కార్యక్రమానికి హాజరై, రాష్ట్రపతి కోవింద్ నుంచి పురస్కారాన్ని స్వీకరించారు. అనంతరం భూపేష్ మాట్లాడుతూ, ఈ పురస్కారం లభించడానికి కారణం రాష్ట్రంలోని పారిశుధ్ధ్య కార్మికులు, పారిశుద్ధ్య వ్యవస్థ, ప్రభుత్వ ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజలు అని చెప్పారు. వీరందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. 


స్వచ్ఛ్ సర్వేక్షణ్, 2021 జాబితాలో మొదటి 10 నగరాలు :

ఇండోర్, సూరత్, విజయవాడ, నవీ ముంబై, పుణే, రాయ్‌పూర్, భోపాల్, వడోదర, విశాఖపట్నం, అహ్మదాబాద్. ఈ సర్వేలో దాదాపు 4,320 నగరాలు, పట్టణాలు పాల్గొన్నాయి. 


Updated Date - 2021-11-20T20:15:55+05:30 IST