పెళ్లయిన 12 ఏళ్లకు భార్య గర్భవతి.. కడుపులో కవలలు ఉన్నారని తెలిసి మరింత సంతోషం.. కానీ పక్కింటి వాళ్ల నిర్వాకంతో..
ABN , First Publish Date - 2022-06-08T21:37:43+05:30 IST
ఆమెకు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది.. పలు కారణాల వల్ల ఇప్పటివరకు ఆమెకు పిల్లలు లేరు.. ఇటీవల ఆమె గర్భం దాల్చింది..
ఆమెకు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది.. పలు కారణాల వల్ల ఇప్పటివరకు ఆమెకు పిల్లలు లేరు.. ఇటీవల ఆమె గర్భం దాల్చింది.. వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఆ మహిళ గర్భంలో కవలలు ఉన్నట్టు తెలిసింది.. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. అయితే పక్కింటి వారి రూపంలో ఆ మహిళను దురదృష్టం వెంటాడింది.. పక్కింట్లో ఉండే ముగ్గురు మహిళలు ఆ మహిళ భర్తతో గొడవకు దిగారు. ఆ క్రమంలో ఆ మహిళను కిందకు తోసేశారు. దీంతో ఆమె గర్భంలోని పిల్లలిద్దరూ చనిపోయారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
15 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల అంకుల్ను కత్తితో పొడిచి చంపేసింది.. అసలు కారణమేంటో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..!
ఇండోర్లోని ఖతీపురాలో నివసిస్తున్న కుసుమ్ అనే మహిళ వివాహమైన 12 ఏళ్ల తర్వాత ఇటీవల గర్భం దాల్చింది. ఆమె గర్భంలో కవల పిల్లలున్నట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, ఆమె ఇంటి పక్కన నివసించే వినీత, దేవరాణి, ఆర్తి అనే మహిళలు తరచుగా తాము వాడేసిన నీటిని కుసుమ్ ఇంటి ముందు పోసేవారు. మే 31వ తేదీ రాత్రి ఆ నీటిలో కాలు వేసి కుసుమ్ అత్తగారు జారి పడిపోయింది. దాంతో కుసుమ్ భర్త, మరిది ఆ ముగ్గురు మహిళలతో వాగ్వాదానికి దిగారు. కుసుమ్ భర్తతో గొడవపడుతూ ఆ ముగ్గురూ ఇంట్లోకి వచ్చారు.
ఆ సమయంలో కుసుమ్ తలుపు దగ్గర నిల్చుంది. గొడవ పడే క్రమంలో ఆ ముగ్గురూ కుసుమ్ను నెట్టేశారు. దాంతో ఆమె కింద పడిపోయింది. తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుసుమ్ను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ చెకప్ చేసి షాకింగ్ విషయం చెప్పారు. గర్భంలోని కవలలిద్దరూ చనిపోయారని చెప్పారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. వారి ఫిర్యాదు మేరకు సోమవారం ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.