Pavithrotsavam: ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-13T20:30:40+05:30 IST

ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. మూడ్రోజుల పాటు ఘనంగా అమ్మవారి పవిత్రోత్సవాలు కొనసాగాయి.

Pavithrotsavam: ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. మూడ్రోజుల పాటు ఘనంగా అమ్మవారి పవిత్రోత్సవాలు కొనసాగాయి. ఏడాదిలో తెలిసీ తెలియక చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా.. అమ్మవారి పవిత్రోత్సవాలు నిర్వహించామని ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్ తెలిపారు. ఆలయంలోని దేవతామూర్తులకు ధరింప చేసిన పవిత్రాలను ప్రజలు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్మకమని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేదోక్తంగా గురువారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఈవో డి.భ్రమరాంబ ఆధ్వర్యంలో దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్‌, ఆర్‌.శ్రీనివాసశాస్త్రి తదితరులు ఊరేగింపుగా పవిత్రాలను తీసుకువచ్చారు. ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పవిత్రాల పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. విఘ్నేశ్వరుడి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, అగ్నిప్రతిష్ఠాపన సర్వప్రాయశ్చిత్త విధులు నిర్వహించి పవిత్రమాలలను మూలవిరాట్టులకు, దేవతా మూర్తులకు ధరింపచేశారు. అమ్మవారికి సుగంధ పరిమళాలు, పవిత్ర కృష్ణానదీ జలాలతో స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని పూలతో సుందరంగా ఆలంకరించారు. అలాగే శ్రావణమాసంలో నిర్వహించే వరలక్ష్మి  వ్రతాన్ని ఈనెల 19న నిర్వహిస్తున్నారు. రూ.1500 రుసుం చెల్లించి పాల్గొనేవారికి ఒక విడత, ఉచితంగా పాల్గొనేవారికి మరో విడత వ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు భక్తులు తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని దేవస్థానం ఒక ప్రకటనలో సూచించింది.

Updated Date - 2022-08-13T20:30:40+05:30 IST