బంగారు తల్లికి తెలంగాణ బోనం

ABN , First Publish Date - 2020-07-06T09:34:42+05:30 IST

భాగ్యనగర (హైదరాబాద్‌) మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో..

బంగారు తల్లికి తెలంగాణ బోనం

ఆంధ్రజ్యోతి, విజయవాడ : భాగ్యనగర (హైదరాబాద్‌) మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే కమిటీ సభ్యులు, కళాకారులు వచ్చారు. ఉదయం 11 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద దేవతామూర్తుల విగ్రహాల వద్ద కొబ్బరికాయలు కొట్టి, పూజలు నిర్వహించి.. ఊరేగింపుగా బయల్దేరి ఘాట్‌రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు.


దుర్గమ్మ దర్శనం చేసుకుని బంగారు బోనంతో పాటు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పదకొండేళ్లుగా కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తున్నామన్నారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్‌బాబు, వేదపండితులు, అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. 


ముగిసిన శాకంబరీ ఉత్సవాలు 

ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఆలయ స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి, కూష్మాండ బలి, మార్జనం కలశోద్వాసన, ఆశీర్వాద కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల వరకు అమ్మవారు శాకంబరీదేవిగానే భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రసాదంగా కదంబం పంచిపెట్టారు. 

Updated Date - 2020-07-06T09:34:42+05:30 IST