పారిశ్రామిక ప్రాంతాల్లో కరోనా కలకలం!!

ABN , First Publish Date - 2022-01-22T04:40:24+05:30 IST

పారిశ్రామిక ప్రాంతమైన ముత్తుకూరు మండలంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి.

పారిశ్రామిక ప్రాంతాల్లో కరోనా కలకలం!!
పీహెచ్‌సీలో కరోనా పరీక్షల కోసం నిరీక్షిస్తున్న పారిశ్రామిక సిబ్బంది

నియంత్రణ కరవు

జాగ్రత్త పడకపోతే ఆందోళనకరం


ముత్తుకూరు, జనవరి 21: పారిశ్రామిక ప్రాంతమైన ముత్తుకూరు మండలంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే, కరోనా వైరస్‌ వేగంగా విస్తరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా నేలటూరు జెన్‌కో థర్మల్‌ కేంద్రం, పంటపాళెంతో పాటు కృష్ణపట్నం పోర్టులోనూ ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం వచ్చేవారిలో అధిక శాతం మంది జెన్‌కో థర్మల్‌ కేంద్రం, కృష్ణపట్నం పోర్టులో పనిచేసే వారే ఉన్నారు. కృష్ణపట్నం పోర్టుతో పాటు, థర్మల్‌ కేంద్రాలు, పామాయిల్‌ పరిశ్రమల్లో పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అధిక శాతం మంది మండలంలో నివాసం ఉంటున్నారు. వీరంతా పదుల సంఖ్యలో ఒకే గదిలో నివసిస్తున్నారు. ఎవరికైనా ఒకరికి కరోనా పాజిటివ్‌ వస్తే, ఇతరులకు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. గత ఏడాది కరోనా విస్తృతంగా ఉన్నప్పుడు కొంతమేర జాగ్రత్తలు పాటించారు. ఆ తర్వాత   కరోనా భయం పోవడంతో నియంత్రణ చర్యలు నామమాత్రంగా మారాయి. మరీ ముఖ్యంగా పామాయిల్‌ పరిశ్రమలు, థర్మల్‌ కేంద్రాల్లో కనీస జాగ్రత్తలు కరవయ్యాయి. సామాజిక దూరం అనే మాటను మర్చిపోయారు. ఈ పది రోజుల్లో మండలంలో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మండల ప్రజలు, అధికారులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం మండల పరిధిలో 300కి పైగా పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు సమాచారం. అధికార లెక్కల ప్రకారమే మూడు వందలు ఉంటే ఖచ్చితంగా మరో 300 పాజిటివ్‌ కేసులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ దశలో సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే, విస్తృతంగా వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు ఇప్పటికైనా పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి, కఠినంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రజలు సైతం స్వచ్భందంగా నిబంధనలను పాటించకపోతే కరోనా ముప్పు కొని తెచ్చుకున్నట్లవుతుంది.

Updated Date - 2022-01-22T04:40:24+05:30 IST