రైతు ఉద్యమానికి మద్దతుగా దీక్షా సమరం
ABN , First Publish Date - 2021-11-27T04:59:24+05:30 IST
కేంద్రప్రభుత్వ నూతన సాగు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా రైతు, కార్మిక, వామపక్ష ప్రజాసంఘాలు నిరసనలు చేపట్టాయి. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రైతు ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన దివ్సగా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. తదనుగుణంగా జిల్లాలో నిరసన దీక్షలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద భారీ దీక్ష చేపట్టారు.
ఏడాది పూర్తయిన సందర్భంగా నిరసన దివస్ పాటింపు
జిల్లావ్యాప్తంగా దీక్షలు, ధర్నాలు, ప్రదర్శనలు
రైతు, కార్మిక, వామపక్ష ప్రజాసంఘాల భాగస్వామ్యం
ఒంగోలు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కేంద్రప్రభుత్వ నూతన సాగు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా రైతు, కార్మిక, వామపక్ష ప్రజాసంఘాలు నిరసనలు చేపట్టాయి. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రైతు ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన దివ్సగా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. తదనుగుణంగా జిల్లాలో నిరసన దీక్షలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద భారీ దీక్ష చేపట్టారు. రైతు, ప్రజాసంఘాల సంయుక్త మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు అధ్యక్షతన జరిగిన దీక్షల్లో వివిధ రైతు, కార్మిక సంఘాల ప్రతినిధులు చుంచుశేషయ్య, లలితకుమారి, హనుమారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, ఎస్ఎస్ సాయి, పీవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. వామపక్షాల నాయకులు పూనాటి ఆంజనేయులు, ఎంఎల్ నారాయణ, ఎస్డీ సర్దార్, జాలా అంజయ్య సంఘీభావం తెలిపారు. అలాగే కందుకూరు, కనిగిరి, అద్దంకి, పర్చూరు, మార్టూరు, మద్దిపాడు, కనిగిరి, పామూరు, దర్శి, చీరాల, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెంతో పాటు పలు పట్టణాలు, మండలకేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. సాగుచట్టాలు రద్దు వల్ల పూర్తిగా రైతులకు ఫలితం లేదని, కనీస మద్దతు ధరలపై స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. అలాగే లేబర్ కోడ్లను ఉపసంహరణతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, అంతవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.