టేకు చెట్ల నరికివేతపై ఆరా
ABN , First Publish Date - 2022-07-01T06:13:11+05:30 IST
సీలేరు అటవీశాఖ రేంజ్ పరిధిలో నరికివేతకు గురైన టేకు ప్లాంటేషన్ను అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్వో రవిశంకర్శర్మ గురువారం పరిశీలించారు.
దబ్బకోట ప్లాంటేషన్ను పరిశీలించిన అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్వో
బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
సీలేరు, జూన్ 30: సీలేరు అటవీశాఖ రేంజ్ పరిధిలో నరికివేతకు గురైన టేకు ప్లాంటేషన్ను అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్వో రవిశంకర్శర్మ గురువారం పరిశీలించారు. జిల్లాలోని జీకేవీధి మండలం సీలేరు అటవీ రేంజ్ ధారకొండ సెక్షన్ పరిధిలో గల దబ్బకోట టేకు ప్లాంటేషన్లో 100 టేకు చెట్లను మే 27న కొంత మంది గిరిజనులు నరికివేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల అటవీశాఖ డీఎఫ్వో, స్క్వాడ్ డీఎఫ్వో, సీసీఎఫ్లు విచారణ జరిపారు. సీసీఎఫ్ రామ్మోహనరావు జూన్ 25న పరిశీలించి నరికివేసిన చెట్లను సీలేరు డిపోనకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం స్టేట్ విజిలెన్స్ డీఎఫ్వో తన బృందంతో దబ్బకోట ప్లాంటేషన్లో నరికివేసిన టేకు చెట్ల మొదళ్ల కొలతలను తీసుకున్నారు. అనంతరం దబ్బకోట గ్రామంలో గిరిజనులతో సమావేశమయ్యారు. రోడ్డు పక్కనే ఉన్న ప్లాంటేషన్ను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో నరికి వేస్తుంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అడవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం దబ్బకోటలో 10 హెక్టార్లల్లో కొత్తగా చేపట్టిన మారుజాతి ప్లాంటేషన్ను పరిశీలించారు. అక్కడ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ 1984లో దబ్బకోట ప్లాంటేషన్ వేశారని, ఈ ప్లాంటేషన్ నరికిన కొంత మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అని విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ సిబ్బంది ప్రమేయం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుం టామన్నారు. ఇటీవల కేడీపేట రేంజ్ పరిధిలో టేకుచెట్లు మాయం సంఘటనలో తమ సిబ్బంది ప్రమేయంం ఉందని విచారణలో తేలడంతో డీఆర్వోని, బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజలు కొంతమంది పోడు వ్యవసాయం కోసం ప్లాంటేషన్లో చెట్లను నరికివేసినట్టు విచారణలో గుర్తించామన్నారు. అలాగే సీలేరు కలప డిపోకు తరలించిన టేకు చెట్లను పరిశీలించారు. ఈ టేకు సైజులను వేలం పాటకు సిద్ధం చేయాలని స్థానిక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డీఎఫ్వో త్రిమూర్తులురెడ్డి, విజిలెన్స్ రేంజ్ అధికారులు దివాకర్, రాఘవయ్య, హుస్సేన్లతో పాటు సీలేరు రేంజ్ అధికారి శ్రీనివాసరావు, డీఆర్వో గోపీ, ధారకొండ సెక్షన్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు