ఉపాధి క్షేత్రసహాయకుడిపై విచారణ

ABN , First Publish Date - 2021-06-18T05:16:03+05:30 IST

ఉపాధి క్షేత్రసహాయకుడిపై విచారణ

ఉపాధి క్షేత్రసహాయకుడిపై విచారణ
విసుగెత్తి దండం పెడుతున్న ఏపీడీ అలివేలు మంగమ్మ, నినాదాలు చేస్తున్న ఉపాధి వేతనదారులు

- వేతనదారుల నిరసన

- అసహనం వ్యక్తం చేసిన ఏపీడీ

దీర్గాశి(పోలాకి) : ఉపాధి హామీ క్షేత్రసహాయకుడు పల్లి అప్పన్నపై ఏపీడీ అలివేలు మంగమ్మ విచారణ చేపట్టారు. ఈ మేరకు గురువారం దీర్ఘాశి సచివాలయం లో ఏపీడీ సమగ్ర విచారణ జరిపారు. అప్పన్నను తొలగించి సీనియర్‌ మేట్‌ మెండ ఎర్రయ్యను క్షేత్రసహాయ కుడిగా నియమించాలని సర్పంచ్‌ మెండ సుమంగళి వర్గం కోరగా... పల్లి అప్పన్ననే కొనసాగించాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు మెండ ప్రసాదరావు, యువజన నాయకులు పాగోటి తాతబాబు, పల్లి రామినాయుడు తదితరులు పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో వీఆర్‌వో ప్రకాశరావు, మహిళా పోలీస్‌ జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. ఇదిలా ఉండగా క్షేత్రసహాయకుడు పల్లి అప్పన్నను కొనసాగించాలని అధిక సంఖ్యలో వేతనదారులు ఏపీడీ ఎదుట నినాదాలు చేశారు. రాజకీయ కారణాలతోనే అప్పన్నను తొలగించాలని చూస్తున్నారని వేతనదారులు కేకలు వేయడంతో ఓ దశలో ఏపీడీ అసహనం వ్యక్తంచేశారు. చివరకు మీకో నమస్కారం అంటూ ఇరువర్గాలు అందించిన ఫిర్యాదులను స్వీకరించి... క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్టు చెప్పి వెళ్లిపోయారు. కార్యక్రమంలో  ఏపీవో స్రవంతి, సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా క్షేత్రహాయకుడు పల్లి అప్పన్నను తొలగిస్తే కోర్టును ఆశ్రయిస్తామని ప్రసాదరావు వర్గం హెచ్చరించింది.  


Updated Date - 2021-06-18T05:16:03+05:30 IST