కండువాల కాంట్రాక్టర్ యూనిట్లో తనిఖీలు
ABN , First Publish Date - 2022-07-07T06:48:08+05:30 IST
టీటీడీకి కల్యాణోత్సవం, వీఐపీ ఆశీర్వచనం కండువాలు సరఫరా చేసే నగరిలోని రాజా పవర్లూమ్ యూనిట్లో అధికారుల బృందం బుధవారం తనిఖీలు చేసింది. అక్కడ తయారవుతున్న వస్ర్తాల నాణ్యతను పరిశీలించింది.
నాసిరకం వస్త్రాలు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు
టీటీడీకి రగ్గులు, దుప్పట్లు కూడా సరఫరా చేస్తామనడంపై ఈవోకు అనుమానం?
నగరి/తిరుపతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్యాణోత్సవం, వీఐపీ ఆశీర్వచనం కండువాలు సరఫరా చేసే నగరిలోని రాజా పవర్లూమ్ యూనిట్లో అధికారుల బృందం బుధవారం తనిఖీలు చేసింది. అక్కడ తయారవుతున్న వస్ర్తాల నాణ్యతను పరిశీలించింది.టీటీడీకీ వస్త్రాలు పంపిణీ చేసే కాంట్రాక్టర్లతో రెండు రోజుల క్రితం ఈవో ధర్మా రెడ్డి సమావేశమయ్యారు. ఈ క్రమంలో కండువాలు సరఫరా చేసే సదరు కాంట్రాక్టర్ రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేస్తామని టెండరులో పాల్గొన్నట్టు తెలిసింది. నగరిలో రగ్గులు, దుప్పట్లు తయారు చేసే యూనిట్లు ఉన్నాయా అని ఈవోకు అనుమానం వచ్చి విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ ఆర్ఎ్ఫఎంఎస్ డిప్యూటీఈవో రామారావు, అడిషనల్ ఎఫ్ అండ్ సీఏఓ అధికారి రవిప్రసాద్, ప్రొక్యూర్మెంట్ జీఎం, ఎలక్రిక్టల్ డీఈ, టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబరు తదితరులు నాలుగు వాహనాల్లో నగరికి వెళ్లారు. అక్కడ రాజా పవర్లూమ్ యూనిట్తో పాటు తిరుమల ఫ్యాబ్రిక్స్, రావిడీ టెక్స్టైల్స్, ఎస్టీ అపరాల్స్ పళనిఅప్ప ఇండస్ట్రీస్, టెక్స్ట్ ఇండియా ఎక్స్పోర్ట్స్ కంపెనీలను పరిశీలించారు. కాగా నాసిరకం కండువాలు టీటీడీకి సరఫరా చేస్తున్నట్టు సదరు కాంట్రాక్టరుపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘కండువాల్లో కక్కుర్తి’ శీర్షికన ఆంధ్రజ్యోతి కూడా గతంలో కథనం ప్రచురించింది. వస్త్రాల తయారీ నాణ్యత పరిశీలించామని, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తనిఖీ చేపట్టిన కమిటీ తెలిపింది.