ఇక యాప్‌లో ‘ఇన్‌స్పైర్‌’

ABN , First Publish Date - 2020-12-01T06:13:09+05:30 IST

ఏడాది ఆలస్యంగా గత విద్యా సంవత్సరానికి సంబంధించిన (2019–20) ఇన్‌స్పైర్‌ మనక్‌ జిల్లాస్థాయి పోటీల నిర్వహణ జరగనున్నది.

ఇక యాప్‌లో ‘ఇన్‌స్పైర్‌’

డిసెంబర్‌ 15 వరకు జిల్లాస్థాయి ఎంపిక పూర్తి


మెదక్‌ అర్బన్‌, నవంబరు 30: ఏడాది ఆలస్యంగా గత విద్యా సంవత్సరానికి సంబంధించిన (2019–20) ఇన్‌స్పైర్‌ మనక్‌ జిల్లాస్థాయి పోటీల నిర్వహణ జరగనున్నది. ఈ మేరకు రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 25లోగా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. డిసెంబర్‌ 5 తేదీలోగా విద్యార్థులతో ప్రాజెక్టులను సిద్ధం చేయించి, 15 వరకు జిల్లాస్థాయి పోటీలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్రస్థాయుకి ఎంపిక చేయనున్నారు. మనక్‌ కాంపిటీషన్‌ యాప్‌ ద్వారా విజ్ఞాన మేళా పోటీలను నిర్వహించనుండటం విశేషం. యాప్‌ ద్వారా పోటీల నిర్వహణపై ఒకటో తేదీన డీఈవో ఆధ్వర్యంలో జిల్లాలోని సైన్స్‌, ఎస్‌సీఈఆర్‌టీ అధికారులతో అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు. 


పలుమార్లు వాయిదా

సాధారణంగా ఇన్‌స్పైర్‌ ప్రాజెక్టుల ప్రదర్శనలు అన్నిస్థాయిల్లో ఎంతో సందడి జరుగుతాయి. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తితో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాంతో పోటీ ప్రదర్శనలు ప్రస్తుతం ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. మాములుగా అయితు మన రాష్ట్రంలో జిల్లా, రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ పోటీలు ఈ సంవత్సరం జనవరిలోనే పూర్తి కావాలి. ఏపీలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించిన మన దగ్గర మాత్రం జరగలేదు. మార్చి చివరి వారంలో లాక్‌డౌన్‌తో ఈ ప్రదర్శనల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. జూన్‌ నెలలో ఆన్‌లైన్‌లో జరుపాలని ఎస్‌సీఈఆర్‌టీ నిర్ణయించినా ముందుకు సాగలేదు. తాజాగా డిసెంబరులో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ కావడంతో పోటీల నిర్వహణకు మార్గం సుగమం అయింది.


ఎంపికైతే రూ. 10 వేల సాయం

విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్‌ ఇన్నోవేషన్‌ పౌండేషన్‌ సంయుక్తంగా ఏటా దేశంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇన్‌స్పైర్‌–మనక్‌ పేరిట అవార్డులు అందిస్తున్నాయి. ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధుల ప్రాజెక్టుల తయారీకి రూ. 10 వేల సాయం అందిస్తోంది. ఈ పోటీని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో నిర్వహిస్తారు.


జిల్లా నుంచి 35 ప్రాజెక్టులు ఎంపిక

2019–20 విద్యా సంవత్సరానికి జిల్లా నుంచి 35 ప్రాజెక్టులు ఎంపికైనట్లు జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులను యాప్‌ ద్వారా ప్రదర్శనల పోటీలను నిర్వహించి ఇందులో నుంచి నాలుగు ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా నిలిచిన వాటిని జాతీయస్థాయికి పంపిస్తారు. అక్కడ బెస్ట్‌గా ఎంపికైన ప్రాజెక్టులకు రూ. 20 వేల ప్రోత్సాహం అందజేస్తారు.


విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకే : రాజిరెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి 

విద్యార్థులను బాల శాస్త్రవేతలుగా తీర్చిదిద్దడమే ఇన్‌స్పైర్‌–మనక్‌ వైజ్ఞానిక ప్రదర్శన ఉద్దేశం. కరోనా నేపథ్యంలో యాప్‌ పోటీలను నిర్వహించేలా చర్యలు తీసుకంటున్నాం. వివరాలకు 8328599157 నంబర్‌లో సంప్రదించాలి.

Updated Date - 2020-12-01T06:13:09+05:30 IST