యువతలో దేశభక్తిని నింపి...

ABN , First Publish Date - 2022-08-11T04:30:15+05:30 IST

పదిహేనేళ్ల వయస్సులోనే స్వాతంత్య్రం కోసం ఉద్యమాల్లో పాల్గొని, గ్రామ గ్రామాన తిరుగుతూ ఎంతోమంది యువతలో దేశభక్తిని నింపిన ఆదర్శనీయుడు మదనపల్లె పట్టణానికి చెందిన మొగిలి పాపన్నగుప్తా.

యువతలో దేశభక్తిని నింపి...
స్వాతంత్య్ర సమరయోధుడు పాపన్న గుప్తా

స్వాతంత్య్ర సమరయోధుడు పాపన్న గుప్తా


మదనపల్లె రూరల్‌, ఆగస్టు 10: పదిహేనేళ్ల వయస్సులోనే స్వాతంత్య్రం కోసం ఉద్యమాల్లో పాల్గొని, గ్రామ గ్రామాన తిరుగుతూ ఎంతోమంది యువతలో దేశభక్తిని నింపిన ఆదర్శనీయుడు మదనపల్లె పట్టణానికి చెందిన మొగిలి పాపన్నగుప్తా. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా యువతలో దేశభక్తిని నింపే కార్యక్రమాలు జరుపుతోంది. స్వాతంత్య్ర ఉద్యమంలో చిన్న వయస్సులోనే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు పాపన్న గుప్తా. మదనపల్లె పట్టణం కోర్టు రామాచారివీధికి చెందిన రామలక్ష్మమ్మ, కృష్ణయ్యలకు 1905 సంవత్సరంలో జన్మించారు పాపన్న గుప్తా. ఈయన తండ్రి బ్రిటీష్‌ ప్రభుత్వంలో ఇన్‌చార్జి డిప్యూటీ కలెక్టరుగా పనిచేశారు. పాపన్న చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. ఆయన చదువుకునే సమయంలో డాక్టర్‌ అనీబిసెంట్‌ ఉపన్యాసాలు విని ఆమె చూపిన ఉద్యమబాటలో నడిచారు. హోం రూల్‌, విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1918లో ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్పు మద్రాసుకు వచ్చినపుడు పాఠశాలల బాలలతో కలసి వెళ్లి ప్రిన్స్‌ సన్మాన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అయితే ఉద్యమాల్లో చురుగ్గా ఉన్న సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా రెవిన్యూలో ఆర్‌ఐగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత తిరిగి దేశాభిమానంతో ఉద్యోగం వదులుకుని విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అప్పటి నుంచి మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించి యువతలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. ఇదే సమయంలో పలుసార్లు జైలు జీవితం అనుభవించారు. బచావత్‌ ఒడంబడికకు చెందిన కమిటీలో సభ్యులుగా వ్యవహరించి, మదనపల్లెలో ఖాదీబండార్‌ స్థాపనలో ప్రముఖపాత్ర పోషించారు. బాల్య వివాహాలను అడ్డుకుని స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ప్రభుత్వం తరపున పలు పదవుల్లో ఆయన తన సేవలను అందించారు. ముఖ్యంగా దక్షిణ భారత హిందీ ప్రచారసభకు ఆంధ్ర ప్రాంతపు చైర్మన్‌గా 20 ఏళ్లు కొనసాగి సేవలందించారు. అదేవిధంగా విజయవాడ, హైదరాబాదు ఆలిండియా రేడియో కేంద్రాలకు ప్రభుత్వం తరపున గౌరవ సంచాలకులుగా వ్యవహరించారు. కాగా దేశ స్వాతంత్య్ర సమరయోధులకు అందజేసే తామ్రపత్రాన్ని 1986లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ శంకర్‌దయాళ్‌శర్మ నుంచి అందుకున్నారు. ఆయన 1986లోనే అనారోగ్యంతో మృతి చెందారు. పాపన్న గుప్తా కుమారుడు మోహనగుప్తా, కుటుంబసభ్యులు నేటికీ మదనపల్లె పట్టణంలో ఉంటున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేసిన తన తండ్రి పాపన్న గుప్తా పేరును పట్టణంలో ఓ వీధికి పెట్టాలని ఆయన కుమారుడు మోహనగుప్తా కోరుతున్నారు.

Updated Date - 2022-08-11T04:30:15+05:30 IST