ఇన్సూరెన్స్ హత్యల ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-09T23:15:05+05:30 IST

బీమా సొమ్ముల కోసం హత్యలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ

ఇన్సూరెన్స్ హత్యల ముఠా అరెస్ట్

నల్లగొండ: బీమా సొమ్ముల కోసం హత్యలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఐజీ ఏ.వి. రంగనాధ్ వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దామరచర్ల కేంద్రంగా ఈ ముఠా పనిచేస్తోందన్నారు. బీమా పాలసీల క్లెయిమ్స్ కోసం హత్యలు చేస్తున్న ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాను అరెస్ట్ చేశామన్నారు.


మొత్తం ఆరు కేసుల్లో రూ.3 కోట్ల 39 లక్షల 40 వేల బీమా క్లెయిమ్ కావలసి ఉందన్నారు. దీనిలో రూ. కోటి 59 లక్షల 40 వేలను ముఠా క్లెయిమ్ చేసిందన్నారు. మిగతా రూ.కోటి 80 లక్షలకు బీమా నాన్ క్లెయిమ్‌గా ఉందన్నారు. నిందితుల్లో ప్రధాన సూత్రధారిగా ధీరావత్ రాజు, వేముల కొండల్, కంచి శివ, మందాడి సాయి సంపత్, దేవిరెడ్డి హారికలను రిమాండ్  చేశామని ఆయన తెలిపారు.


 అక్రమ సంబంధాలు, అనారోగ్యం, మద్యానికి బానిసలైన వారినే టార్గెట్‌గా చేసుకుని నిందితులు బీమా పాలసీలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పాలసీదారుల కుటుంబ సభ్యుల సహకారంతో పాలసీ హోల్డర్‌ను హత్యలు చేసి బీమా సొమ్ములను క్లెయిమ్స్ చేసి ముఠా పంచుకుంటుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఈ ముఠా ఐదు హత్యలు చేసిందని డీఐజీ  వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-09T23:15:05+05:30 IST