Uriలో హైడ్రో పవర్ ప్రాజెక్టులపై ఉగ్ర కన్ను...కశ్మీర్‌లో హైఅలర్ట్

ABN , First Publish Date - 2021-10-18T23:37:52+05:30 IST

ప్రభుత్వ నిర్మాణాలపై ఉగ్రదాడులకు అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ సమాచారంతో కశ్మీర్‌లో..

Uriలో హైడ్రో పవర్ ప్రాజెక్టులపై ఉగ్ర కన్ను...కశ్మీర్‌లో హైఅలర్ట్

న్యూఢిల్లీ: ప్రభుత్వ నిర్మాణాలపై ఉగ్రదాడులకు అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ సమాచారంతో కశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, 'హర్కత్ 313' అనే కొత్త తీవ్రవాద సంస్థ ఉరిలోని జల విద్యుత్ (హైడ్రో పవర్) ప్లాంట్లను తమ దాడులకు లక్ష్యంగా చేసుకుంది. టెర్రరిస్టుల టార్గెట్‌లో అనంతనాగ్‌లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఎల్ఓసీకి సమీపంలో ఉన్న ఉరి-1, ఉరి-2 హైడ్రో పవర్ ప్రాజెక్టుల చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


కాగా, కశ్మీర్ లోయలోని మత నాయకులపై దాడులకు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ ప్రణాళిక రూపొందించినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. అలాగే సర్పంచులు, స్థానికేతరులను పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తొయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) లక్ష్యంగా చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లోని స్థానికేతర వర్కర్లపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ నెలలో జరిపిన వరుస దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈనెల మొదట్లో బీహార్‌కు చెందిన ఇద్దరు వర్కర్లను ఉగ్రవాదులు కాల్పిచంపగా, ఒకరు గాయపడ్డారు. బీహార్‌కు చెందిన స్ట్రీట్ వెండర్‌ను, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్పెంటర్‌ను శనివారం సాయంత్రం తీవ్రవాదులు కాల్చిచంపారు.

Updated Date - 2021-10-18T23:37:52+05:30 IST