అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు
ABN , First Publish Date - 2022-05-28T06:12:48+05:30 IST
రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఐదుగురు దొంగలను అరెస్టు చేసి, వారి నుంచి రూ.25 లక్షల విలువైన బంగారం, ఐదు మోటారు సైకిళ్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు.
రూ.25 లక్షల విలువైన బంగారం, నగదు,
మోటారు సైకిళ్లు స్వాధీనం : ఎస్పీ రవిప్రకాష్
తాడేపల్లిగూడెం క్రైం, మే 27 : రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఐదుగురు దొంగలను అరెస్టు చేసి, వారి నుంచి రూ.25 లక్షల విలువైన బంగారం, ఐదు మోటారు సైకిళ్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. తాడేపల్లిగూడెం పోలీసుస్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులకు కేసుల వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన పిండ్రాల రాంబాబు, పిండ్రాల వెంకన్న దొంగతనాలు చేస్తూ పోలీసుల హిట్ లిస్టులో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి చాగల్లు మండలం రామచంద్రాపురం, కలవలపల్లి గ్రామాల్లో భార్యా పిల్లలతో ఉంటూ ఎవరికి అనుమానం లేకుండా పగలు కూలి పనులకు వెళుతూ, రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తుండేవారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం, దండగర్ర, వెంకట్రావుపాలెం, కృష్ణాపురం, చిన్నతాడేపల్లి గ్రామాల్లో తొమ్మిది చోరీలకు పాల్పడ్డారు. వీటికి సంబంధించి 41 కాసుల బంగారం వస్తువులు, రూ.2.40 లక్షల నగదు, చోరీలకు ఉపయోగించిన మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో షేక్ అబ్ధుల్ రషీద్, లంకలపల్లి చంద్రశేఖర్, సత్యల దుర్గాప్రసాద్, మరో మైనర్ను అదుపులోకి తీసుకుని నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ నాగరాజు, ఎస్ఐ ఎన్.శ్రీనివాస్, రాజు, జీజే ప్రసాద్, సిబ్బందిని అభినందించి, వీరికి రివార్డు ప్రకటించారు. భీమవరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.