పుంత రోడ్లు అధ్వానం

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

రైతులకు ఉపయోగపడే పుంత రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథులే లేరు.

పుంత రోడ్లు అధ్వానం
అధ్వానంగా మారిన కాకరపర్రు పుంత రోడ్డు

ఐదారేళ్లుగా మరమ్మతులు నిల్‌ 

పంట బయటకు తీసుకొచ్చేందుకు రైతులకు అవస్థలు 

పెరవలి, జనవరి 22: రైతులకు ఉపయోగపడే పుంత రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథులే లేరు. రైతులు పండించిన పంటను బయటకు  తీసుకురావాలంటే ఈ పుంత రోడ్లు అవసరం. ఐదారేళ్లుగా వీటికి మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా మారి వాహనాల రాకపోకలకు  అవకాశం లేకుండా మారింది. రైతులు అరటి, కొబ్బరి, ధాన్యం బస్తాలు, చెరుకు, ఇతర ఉత్పత్తులను బయటకు తీసుకురావడానికి, పంటలకు అవసరమైన ఎరువులు తీసుకెళ్లాలన్నా వాహనాలు  రాకపోకలకు సరైన  రహదారి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

పంటల కొనుగోలుదారులు లక్షలాది రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తూ ఉంటారు. పుంత రోడ్ల అభివృద్ధికి మార్కెట్‌ కమిటీలు నిఽధులు మంజూరు చేస్తూ ఉండేవి. కాలక్రమంలో మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యమై ఒక్క పైసా కూడా అభివృద్ధికి కేటాయించని దుస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో కొన్ని నెలలు పాటు మార్కెట్‌ కమిటీలు పన్నులు వసూలు చేయకూడదని నిబంధనలు వచ్చినా మళ్లీ పన్నులు వసూలు చేసుకునే విధంగా ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిన సొమ్మును ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడం తప్ప పుంత రోడ్ల అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో ఈ విధంగా రెండు, మూడు పుంత రోడ్లు వరకు ఉంటాయి. ప్రతి ఏటా ఎంతోకొంత వీటి అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే ఉపయోగంగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST