నల్లమలలో మంత్రి కాన్వాయ్ అడ్డగింపు
ABN , First Publish Date - 2021-07-27T07:26:45+05:30 IST
నల్లమలలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి గుంతలమయంగా మారిందని, మరమ్మతు చేయించాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి
కేజీ రోడ్డుకు మరమ్మతు చేయించాలని టీడీపీ ఆందోళన
ఆత్మకూరు, జూలై 26: నల్లమలలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి గుంతలమయంగా మారిందని, మరమ్మతు చేయించాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. టీడీపీ నంద్యాల లోక్సభ అధికార ప్రతినిధి మోమిన్ ముస్తఫా నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం నల్లమలలోని సిద్ధాపురం చెరువు కట్ట సమీపంలో కేజీరోడ్డుపై ఆందోళనకు దిగారు. రోడ్డును బాగుచేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో శ్రీశైలం నుంచి ఆత్మకూరు మీదుగా కర్నూలు వెళ్తున్న మంత్రి రంగనాథరాజు కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ.. కర్నూలు నుంచి అమరావతికి ఉన్న ప్రధాన రహదారి ఇంత అధ్వానంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.. కాగా.. టీడీపీ శ్రేణుల రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆత్మకూరు డీఎస్పీ వై.శృతి, ఎస్ఐ హరిప్రసాద్ అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ధర్నా, కొవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ ముస్తఫాతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.