చెన్నై సహా 3 జిల్లాలను కప్పేసిన మంచుదుప్పటి

ABN , First Publish Date - 2021-02-28T12:18:27+05:30 IST

సాధారణంగా రాష్ట్రంలో డిసెంబర్‌ నుంచి జనవరి దాకా దట్టమైన మంచు కురుస్తుంది. కానీ, ఈ యేడాది ఫిబ్రవరి మాసంలో కూడా ఈ మంచు ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం వేకువజామున చెన్నైతో పాటు...

చెన్నై సహా 3 జిల్లాలను కప్పేసిన మంచుదుప్పటి

విమానసర్వీసులకు అంతరాయం

చెన్నై/అడయార్ (ఆంధ్రజ్యోతి): సాధారణంగా రాష్ట్రంలో డిసెంబర్‌ నుంచి జనవరి దాకా దట్టమైన మంచు కురుస్తుంది. కానీ, ఈ యేడాది ఫిబ్రవరి మాసంలో కూడా ఈ మంచు ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం వేకువజామున చెన్నైతో పాటు విల్లుపురం, మదురై జిల్లాల్లో  పొగమంచు దట్టంగా అలముకుంది.. దీంతో రహదారులు కనిపించలేదు. ఫలితంగా వాహనచోదకులు డ్రైవింగ్‌ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. సాధారణంగా ఎంత మంచుకురిసినా.. ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే ఉంటుంది. కానీ, శనివారం ఉదయం ఆరు గంటల తర్వాత కూడా ఈ మంచు దట్టంగా అలముకుని వుండటంతో ప్రజలతో పాటు.. డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వేకువజామున దక్షిణాది జిల్లాల నుంచి రాజధాని చెన్నై నగరానికి వచ్చే వాహనదారులను ఈ మంచు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. రెండు రోజుల క్రితం కూడా చెంగల్పట్టు జిల్లా మదురాంతకం వద్ద దట్టమైన మంచు కారణంగా రహదారి కనిపించకుండా ఓ కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మంచు కారణంగా చెన్నై నగరానికి ఉదయం వేళలో వచ్చే వాహనాలు గంటల కొద్ది ఆలస్యంగా వస్తున్నాయి. మంచు కారణంగా చెన్నై విమానాశ్రయంలో 26 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి 107 మంది ప్రయాణికులతో వచ్చిన ప్రైవేటు విమానం మంచుకారణంగా చెన్నై విమానాశ్రయంలో దిగలేకపోయింది. దీనితో ఆ విమానాన్ని బెంగళూరుకు మళ్ళించారు. మంచు వల్ల బెంగళూరు, హైదరాబాద్‌, ముంబాయి, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి ఆరు విమానాలు ఆలస్యంగా చెన్నై చేరాయి. చెన్నై విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌, పుణే, దోహా, మదురై, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు వెళ్ళాల్సిన 20 విమానాలు గంట ఆలస్యంగా బయల్దేరాయి.

Updated Date - 2021-02-28T12:18:27+05:30 IST