నేటినుంచి ఇంటర్ స్పాట్
ABN , First Publish Date - 2022-05-22T06:14:15+05:30 IST
నేటినుంచి ఇంటర్ స్పాట్
ఖమ్మం నయాబజార్ పాఠశాల కేంద్రంగా మూల్యాంకనం
క్యాంపునకు 3,95,852 సమాధాన పత్రాల కేటాయింపు
ఖమ్మం ఖానాపురం హవేలీ, మే 21: ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం నేడు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్స్పాట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈసారి జిల్లాకు గతం కంటే అధికంగా 25వేల సమాధాన పత్రాలు వచ్చాయి. జూన్ 10లోగా స్పాట్ ముగుస్తుందని అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. పరీక్షల మూల్యాంకనంలో అన్ని హోదాల్లో 2,121మంది విధులు నిర్వహించనున్నారు. క్యాంప్ ఆఫీసర్గా జిల్లా ఇంటర్ విద్యాధికారి కే.రవిబాబును నియమించారు. 1,830 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 110 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 113 మంది స్ర్కూటినైజర్లు, 10 మంది సబ్జెక్ట్ నిపుణులు, 45 మంది ఏసీవోలు, 10 మంది స్ర్టాంగ్ రూమ్, ప్యాకింగ్, కోడింగ్ విభాగాల బాధ్యులు పనిచేస్తున్నారు. స్పాట్ కేంద్రంలో పటిష్ట భద్రతతోపాటు సీసీ కెమెరాలను అమర్చారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా, స్పాట్లోని అన్ని పరిసరాలూ కనిపించేలా 11అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాలుగు విడతల్లో సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధ్యాపకులు స్పాట్లో పాల్గొంటారు. నయాబజార్ స్పాట్ క్యాంపునకు మొత్తం 3,95,852 సమాధాన పత్రాలను కేటాయించారు. ఈ వాల్యూయేషన్ ప్రక్రియలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు సంబంధించిన అధ్యాపకులు పాల్గొంటారు.