అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-11-27T07:38:00+05:30 IST

ఏటీఎంలకు వచ్చే చదువురాని వారిని లక్ష్యంగా చేసుకుని నగదు కొట్టేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను తిరుపతి ఈస్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌
నిందితుడిని చూపి వివరాలు వెల్లడిస్తున్న ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ

రూ.2.75 లక్షల నగదు, స్కూటర్‌ స్వాధీనం


తిరుపతి(నేరవిభాగం), నవంబరు 26: ఏటీఎంలకు వచ్చే చదువురాని వారిని లక్ష్యంగా చేసుకుని నగదు కొట్టేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను తిరుపతి ఈస్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం నిందితుడిని మీడియాకు చూపి.. డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శివప్రసాద్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆ ప్రకారం.. అనంతపురం జిల్లా తనకల్లు మండలం బాలసముద్రం గ్రామం కొక్కంటి క్రాస్‌కు చెందిన సున్నపుశెట్టి కృష్ణమూర్తి కొన్నేళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఏటీఎం సెంటర్లవద్ద మాటువేసి, చదువురాని వారికి సాయం చేసే నెపంతో వారి పిన్‌ వివరాలను తెలుసుకుంటాడు. తనవద్ద సిద్ధంగా ఉంచుకున్న నకిలీ ఏటీఎం కార్డును వారికి అందించి.. వారి నిజమైన ఏటీఎం కార్డును తస్కరిస్తాడు. ఆ తర్వాత ఏటీఎంల నుంచి నగదు తీసుకుంటాడు. ఇలా ఈస్ట్‌, తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కృష్ణమూర్తి మూడు ఏటీఎంలలో మోసం, చోరీలకు పాల్పడ్డాడు. సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రకా్‌షకుమార్‌ అతడిపై నిఘాపెట్టి రామానుజ కూడలివద్ద శుక్రవారం పట్టుకున్నారు. అతడి వద్దఉన్న రూ.2,75,800 నగదు, నకిలీ ఏటీఎం కార్డులు, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. పాత నేరస్తుడు కృష్ణమూర్తిపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 12 కేసులున్నట్టు వివరించారు. నిందితుడి పట్టుకున్న సీఐ, ఎస్‌ఐలతోపాటు హెడ్‌కానిస్టేబుల్‌ మునిరాజులు, కానిస్టేబుళ్లు ప్రభాకర్‌, ఈశ్వరయ్యను డీఎస్పీ అభినందించారు. రివార్డుకోసం ఎస్పీకి ప్రతిపాదనలు పంపామన్నారు. డీఎస్పీతోపాటు ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రకా్‌షకుమార్‌, సిబ్బంది విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-27T07:38:00+05:30 IST