సదరం స్లాట్ బుకింగులకు విరామం
ABN , First Publish Date - 2020-07-06T11:29:38+05:30 IST
సదరం సర్టిఫికెట్ల కోసం దివ్యాంగులు మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కరోనా మహమ్మారి విస్తరిస్తుండడంతో..
కరోనాతో నిలిపివేత.. దివ్యాంగులకు ఇబ్బందులు
తణుకు, జూలై 5 : సదరం సర్టిఫికెట్ల కోసం దివ్యాంగులు మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కరోనా మహమ్మారి విస్తరిస్తుండడంతో మీ సేవ కేంద్రాల్లో స్లాట్ల బుకింగ్ నిలిపివేశారు. గతంలో ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ప్రభుత్వాసుపత్రుల్లో స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఆయా ఆసుపత్రులలో పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం తణుకు మినహా మిగిలిన ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం ఆసుపత్రులు కొవిడ్ సెంటర్లుగా మారిపోయా యి. పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడం.. దివ్యాంగుల ఆరోగ్య దృష్యా ఇప్పట్లో స్లాట్ల బుకింగ్ లేనట్టేనని జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ కె.శంకరరావు స్పష్టం చేశారు. జిల్లాలో నాలుగు వేల మంది ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది దివ్యాంగులు సద రం సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టాలని సీపీఐ నేత బొద్దాని నాగరాజు కోరుతున్నారు.
ఏడు నెలలుగా ఇవ్వడం లేదు : బొద్దాని ప్రతాప్, తణుకు
రోడ్డు ప్రమాదంలో ఇటీవల చేయి తీసేశారు. ఏ పనులు చేయలేను. సద రం సర్టిఫికెట్ తీసుకుందామంటే స్లాట్లు బుక్ చేయడం లేదు. ఏడు నెలల నుంచి ఇదే పరిస్థితి.
పథకాలు అందడం లేదు : యిందుకూరి రమాదేవి
పథకాల్లో దివ్యాంగులు లబ్ధి పొందాలంటే కచ్చితంగా సదరం సర్టిపికెట్ ఉండాలి. కరోనాతో ఆసుపత్రుల్లో ఇది ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రభుత్వ పథ కం అందడం లేదు. అధికారులే దయచూపాలి.