5 రోజుల్లో రూ.8 లక్షల కోట్ల నష్టం

ABN , First Publish Date - 2022-04-20T02:11:31+05:30 IST

ముంబై : నష్టాల బాటలో పయనిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తున్నాయి. సూచీల వరుస 5 రోజుల పతనంతో రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది.

5 రోజుల్లో రూ.8 లక్షల కోట్ల నష్టం

ముంబై : నష్టాల బాటలో పయనిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తున్నాయి. సూచీల వరుస 5 రోజుల పతనంతో ఏకంగా రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్ల క్షీణతకు దారితీస్తున్నాయి. నష్టాల కొనసాగింపుగా ఐదవ రోజయిన మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 703.59 పాయింట్లు లేదా 1.23 శాతం పతనమై 56,463.15 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో గత 5 సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 2,984.03 పాయింట్లు లేదా 5.01 శాతం మేర దిగజారినట్టయింది. దీంతో 5 రోజుల్లోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల క్యాపిటలైజేషన్ రూ.8,08,067.6 కోట్ల మేర క్షీణించి రూ.2,66,02,728.45 కోట్లకు పడిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణకు విదేశీ మదుపర్లు మొగ్గుచూపుతుండడం, ద్రవ్యోల్బణం ఆందోళనలు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు ఇన్వెస్టర్లను భయాలకు గురిచేస్తున్నాయి. ఈ కారణంగానే మార్కెట్లో అమ్మకాల జోరు కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 


మార్కెట్లో ట్రెండ్స్‌పై ఈక్విటీ99 రీసెర్చ్ హెడ్ రాహుల్ శర్మ స్పందిస్తూ.. మంగళవారం మార్కెట్లో చివరి 30 నిమిషాల్లో అమ్మకాల జోరు కనిపించిందని చెప్పారు. ప్రామాణిక సూచీలు 1.5 శాతం వరకు దిద్దుబాటుకు గురయ్యాయని వివరించారు. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలు ప్రతికూలంగా మారాయి. మరోపక్క రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కూడా మార్కెట్ల భయాలకు కారణమవుతున్నాయని విశ్లేషించారు.

Updated Date - 2022-04-20T02:11:31+05:30 IST