స్వేచ్ఛా వాణిజ్యమే మా అభిమతం
ABN , First Publish Date - 2022-05-25T07:47:58+05:30 IST
పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధికి దోహదం చేసే ‘న్యాయ’మైన స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్టు ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ (ఐపీఈఎఫ్) ప్రకటించింది.
అపుడే సుస్థిర అభివృద్ధి, పెట్టుబడులు
చర్చల ద్వారా కొత్త రంగాల గుర్తింపు
ఐపీఈఎఫ్ సంయుక్త ప్రకటన
టోక్యో: పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధికి దోహదం చేసే ‘న్యాయ’మైన స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్టు ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ (ఐపీఈఎఫ్) ప్రకటించింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన 13 దేశాల ఐపీఈఎఫ్ మంగళవారం ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసింది. చర్చల ద్వారా ఆర్థిక రంగంలో సహకారానికి మరిన్ని కొత్త రంగాలను గుర్తించేందుకూ అంగీకరించింది. ఈ ప్రాంత దేశాలకు స్థిరమైన, సమ్మిళిత అభివృద్ధి సాధించే సత్తా ఉన్నట్టు పేర్కొంది.
ఐపీఈఎఫ్ దేశాల ఆర్థికాభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న విషయాన్నీ సంయుక్త ప్రకటన గుర్తు చేసింది. ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం మీద ఈ దేశాల దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉందని తెలిపింది. తమ భవిష్యత్ చర్చలన్నీ వాణిజ్యం, సరఫరా మార్గాలు, చౌక ఇంధన వనరుల అభివృద్ధి, కాలుష్య నియంత్రణ, మౌలిక సదుపాయాలు, పన్నులు, అవినీతి నిర్మూలన అంశాలపైనే ఉంటాయని పేర్కొంది. ఈ దేశాల ఆర్థిక సామర్ధ్యం అంతా ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, నవకల్పనలకు ప్రోత్సాహం, ఆర్థిక రంగంలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర, ఇంధన భద్రత, వాతావరణ సంక్షోభాన్ని నివారించడంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.