
ఈ రోజు నుండి దేశంలో ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు ఆడనున్నారు. ఈ మ్యాచ్లకు అన్ని జట్లూ ఇప్పటికే సిద్ధమయ్యాయి. కాగా ఐపీఎల్లో ఆడే జట్లలోని ఆటగాళ్లను వేలంలో పెట్టి కోట్లకు పాడారు. అయితే ఐపీఎల్లో కామెంటరీ చేసే వ్యాఖ్యాతలు కూడా కోట్ల రూపాయలు అందుకోబోతున్నరని మీకు తెలుసా? హిందీ, ఇంగ్లీషుతో సహా వివిధ భాషలలలోని వ్యాఖ్యాతలకు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ భారీ మొత్తాన్ని అందజేస్తుంది.
ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్.. భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, అంజుమ్ చోప్రా, హర్భజన్ సింగ్ మరియు సురేష్ రైనాతో సహా పలువురు అనుభవజ్ఞులను కలిగి ఉంది. బ్రాడ్కాస్టర్ 80 మంది వ్యాఖ్యాతలతో కూడిన భారీ బృందాన్ని ఏర్పాటు చేసింది. 80 మంది వ్యాఖ్యాతలతో కూడిన ఈ బృందం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లోని 24 ఛానెళ్లలో 8 భాషల్లో వ్యాఖ్యానం చేస్తుంది. ఐపిఎల్లో హిందీ, ఇంగ్లీషు భాషలలోని వ్యాఖ్యానమే కాకుండా ప్రేక్షకులు మరాఠీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళ భాషలలో వ్యాఖ్యానాలను కూడా వినగలుగుతారు. స్టార్ స్పోర్ట్స్ తెలిపిన వివరాల ప్రకారం ఐపీఎల్ హిందీ వ్యాఖ్యాతల జట్టులో రవిశాస్త్రి, ఆకాష్ చోప్రా, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, కిరణ్ మోర్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, పీయూష్ చావ్లా, నిఖిల్ చోప్రా, మయంతి లాంగర్, జతిన్ సప్రూ, సురేన్ సుందరం ఉన్నారు. మహిళల్లో హోస్ట్ కమ్ వ్యాఖ్యాతగా తాన్యా పురోహిత్ ఈ జట్టులో చేరనున్నారు. స్పోర్ట్సన్ఫోల్డ్ నివేదిక ప్రకారం ఈ హిందీ వ్యాఖ్యాతలు ఐపీఎల్లోని ఈ సీజన్కు 80 వేల నుండి 3.5 లక్షల డాలర్లు అంటే దాదాపు రూ. 61 లక్షల నుండి రూ. 2.67 కోట్ల వరకు అందుకోబోతున్నారని తెలుస్తోంది.