ధోనీ కంటే జడేజాకే..!

ABN , First Publish Date - 2021-12-01T09:05:46+05:30 IST

ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకొనే ఆటగాళ్లు ఎవరో తేలిపోయింది. 8 ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకున్న మొత్తం 27 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది.

ధోనీ కంటే జడేజాకే..!

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండర్‌కు భారీ ధర

కోహ్లీని తక్కువ ధరకే.. బెంగళూరుకే సిరాజ్‌ 

వార్నర్‌, రషీద్‌ను వదిలేసిన సన్‌రైజర్స్‌

ఐపీఎల్‌ రిటెన్షన్‌ జాబితా 


న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకొనే ఆటగాళ్లు ఎవరో తేలిపోయింది. 8 ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకున్న మొత్తం 27 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 42 కోట్లు వెచ్చించి ధోనీ సహా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకొంది. అయితే, తొలి ప్రాధాన్య ఆటగాడిగా జడేజాను ఎంచుకోవడంతో ధోనీ కంటే రూ. 4 కోట్లు జడ్డూకు అదనంగా ముట్టనుంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌తోపాటు హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ను అట్టిపెట్టుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, గత సీజన్‌లో రూ. 17 కోట్లు పలికినకోహ్లీ, రూ. 14.25 కోట్లు పలికిన మ్యాక్సీ జీతాల్లో కోతపడనుంది. లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ను రిటైన్‌ చేసుకుంటుందని అందరూ అంచనా వేస్తే.. సిరాజ్‌ను తీసుకొంది. ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ, బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌లను అట్టి పెట్టుకొంది. దీంతో ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, క్రునాల్‌ పాండ్యాలు వేలానికి రానున్నారు. డేవిడ్‌ వార్నర్‌తోపాటు అట్టిపెట్టుకొనే ఆటగాళ్లలో తొలి ప్రాధాన్యం తనకే దక్కాలని డిమాండ్‌ చేసిన అఫ్ఘాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌తోపాటు, బెయిర్‌స్టోను కూడా సన్‌రైజర్స్‌ వదులుకొంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తోపాటు అన్‌క్యా్‌ప్డ ఆటగాళ్లు అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లను రిటైన్‌ చేసుకుంది.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కేన్‌ విలియమ్సన్‌ (రూ. 14 కోట్లు), అబ్దుల్‌ సమద్‌ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్‌ మాలిక్‌ (రూ. 4 కోట్లు) 

రాజస్థాన్‌ రాయల్స్‌: సంజూ శాంసన్‌ (రూ. 14 కోట్లు), జోస్‌ బట్లర్‌ (రూ. 10 కోట్లు), యశస్వీ జైస్వాల్‌ (రూ. 4 కోట్లు)

పంజాబ్‌ కింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (రూ. 12 కోట్లు), అర్ష్‌దీప్‌ సింగ్‌ (రూ. 4 కోట్లు)


కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విచిత్రంగా ఆండ్రీ రస్సెల్‌ను తొలి ప్రాధాన్యతా ప్లేయర్‌గా తీసుకున్నా.. వెంకటేష్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తిని సమాన ధర రూ. 8 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ను రూ. 6 కోట్లకే తీసుకుంది. శ్రేయాస్‌ అయ్యర్‌ను వదిలేసిన ఢిల్లీ పంత్‌, అక్షర్‌, పృథ్వీషాలను మళ్లీ తీసుకొంది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వేలానికి వెళ్లడానికి మొగ్గుచూపడంతో అతడిని వదిలేసిన పంజాబ్‌.. మయాంక్‌తోపాటు అన్‌క్యా్‌ప్డ అర్ష్‌దీప్‌ సింగ్‌ను రిటైన్‌ చేసుకుంది. మొత్తంగా చూస్తే భారత ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్న ఫ్రాంచైజీలు చాలా వరకు వారిని వదులుకోలేదు. 


రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితా

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రవీంద్ర జడేజా 

(రూ. 16 కోట్లు), ధోనీ (రూ. 12 కోట్లు), 

మొయిన్‌ అలీ (రూ. 8 కోట్లు), 

రుతురాజ్‌ గైక్వాడ్‌ (రూ. 6 కోట్లు). 

ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (రూ. 16 కోట్లు), బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ. 8 కోట్లు), పొలార్డ్‌ (రూ. 6 కోట్లు). 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ (రూ. 15 కోట్లు) , గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు), సిరాజ్‌ (రూ. 7 కోట్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: రస్సెల్‌ (రూ. 12 కోట్లు), వెంకటేష్‌ అయ్యర్‌ (రూ. 8 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు), సునీల్‌ నరైన్‌ (రూ. 6 కోట్లు) 

ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషభ్‌ పంత్‌ (రూ. 16 కోట్లు), అక్షర్‌ పటేల్‌ (రూ 9 కోట్లు), 

పృథ్వీ షా (రూ. 7.5 కోట్లు), 

అన్రిచ్‌ నోకియా (రూ. 6.5 కోట్లు)

Updated Date - 2021-12-01T09:05:46+05:30 IST