Kanpur Test: గ్రీన్‌పార్క్ స్టేడియంలో చెత్త ఏరుతూ కనిపించిన ఐపీఎస్ అధికారి

ABN , First Publish Date - 2021-11-27T01:46:27+05:30 IST

భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో

Kanpur Test: గ్రీన్‌పార్క్ స్టేడియంలో చెత్త ఏరుతూ కనిపించిన ఐపీఎస్ అధికారి

కాన్పూరు: భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిశాక కెమెరాకు చిక్కిన ఓ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నేస్తోంది. రెండో రోజు ఆటలో స్టేడియంలో ఐపీఎస్ అధికారి ఆసిమ్ అరుణ్ కనిపించారు. అక్కడ ఆయన కనిపించడంలో విశేషం ఏముంది అనుకోవద్దు. మ్యాచ్ చూసేందుకు వచ్చారని భావించినా అది తప్పే అవుతుంది. ఎందుకంటే ఆయన కనిపించింది స్టాండ్స్‌లోని చెత్త ఏరుతూ. 


పోలీస్ కమిషనర్ అయిన అరుణ్.. మ్యాచ్ ముగిసిన వెంటనే.. ప్రేక్షకులు తిని పారేసిన చెత్తాచెదారం, మంచినీళ్ల సీసాలతోపాటు స్టాండ్స్‌లోని ఇతర చెత్తను ఏరి సంచిలో వేస్తూ కనిపించారు. ఎవరో దీనిని తమ మొబైల్‌లో బంధించి సామాజిక మాధ్యమాలకు ఎక్కించడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. 


స్టేడియాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో చెత్త ఏరుతున్న తన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంపై అసీమ్ అరుణ్ ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. కాన్పూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచనలతోనే తాను ఆ పనికి పూనుకున్నట్టు చెప్పారు.


గ్రీన్‌పార్క్‌తో తన పనిని ప్రారంభించే అవకాశాన్ని కాన్పూరు వాసులు ఇచ్చినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, స్టేడియంలోని చెత్తాచెదారాన్ని ఏరి శుభ్రం చేస్తున్న అరుణ్‌ను చూసిన చాలామంది యువకులు వారు కూడా చేయి కలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడండి. 



Updated Date - 2021-11-27T01:46:27+05:30 IST