‘ఐరిష్’ కష్టాలు
ABN , First Publish Date - 2021-02-23T05:26:53+05:30 IST
ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరఫరా విధివిధానాలను ఇటీవల మార్చింది.
స్కాన్ అవకపోవడంతో అందని రేషన్
అవస్థలు పడుతున్న వృద్ధులు
సత్తుపల్లి, ఫిబ్రవరి 22 : ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరఫరా విధివిధానాలను ఇటీవల మార్చింది. మొన్నటి వరకు ఉన్న లబ్ధిదారుల బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయగా.. ఇక నుంచి ఐరిష్ స్కాన్ చేయడం ద్వారా అది కుదరకపోతే ఓటీపీ విధానంలో రేషన్ అందించాలని డీలర్లుకు మార్గదర్శకాలు ఇచ్చింది. అక్రమాలను నిరోధించే లక్ష్యంతో ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా.. వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఐరిష్ సక్రమంగా స్కాన్ అవకపోతుండటంతో రేషన్ పొందలేకపోతున్నారు.
ఐరిష్ గుర్తింపులో ఇబ్బందులు..
రేషన్ లబ్ధిదారులు వారి ఆధార్ కార్డుకు తమ తమ సెల్నెంబర్లను లింకు చేసుకోవాల్సి ఉంటుంది. అది లింకయి ఉంటేనే నేరుగా వారి సెల్నెంబర్కు ఓటీపీ (ఒన్ టైం పాస్వర్డ్) వస్తుంది. అయితే రేషన్ కోసం వెళ్లిన లబ్ధిదారులకు తొలుత ఐరిష్ స్కాన్ చేస్తారు. ఆ ఐరిష్ సక్రమంగా స్కాన్ కానిపక్షంలో ఆధార్నెంబరుకు లింకు అయి ఉన్న మొబైల్ నెంబరుకు ఓటీపీ ఇస్తారు. ఆ ఓటీపీని చెబితే రేషను ఇస్తారు. అయితే ఐరిస్ స్కాన్ విషయంలో ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ప్రధానంగా వృద్ధులు రేషన్ షాపునకు వచ్చిన సమయంలో వారి కళ్లను స్కాన్ చేసే క్రమంలో వృద్ధులు సరిగా చూడలేకపోవటం, వారి కళ్లలో నీరు రావటం తదితర సమస్యల వల్ల వారి ఐరిష్ స్కానింగ్ సక్రమంగా జరగడం లేదు. ఈ క్రమంలో అర్హులైనప్పటికీ ఆ వృద్ధులను లబ్దిదారులుగా గుర్తించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రేషన్ సరఫరా కష్టంగా మారింది. ఈ క్రమంలో కొందరు లబ్ధిదారుల ఆధార్కు లింక్ అయి ఉన్న సెల్నెంబర్కు ఓటీపీ వస్తున్నా వారు చెప్పలేకపోవడం, లేదంటే ఫోన్నెంబర్లు మారిపోవడం లాంటి సమస్యలతో వారు సతమతమవుతున్నారు.
తహసీల్దార్ను ఆశ్రయించిన మహిళ..
తన చూపు మందగించిందని ఐరిస్ స్కాన్ కాకపోవటంతో తనకు రేషన్ బియ్యం రావటం లేదంటూ సత్తుపల్లి తహసీల్దార్ మీనన్కు స్థానిక ఎన్టీఆర్ నగర్కు చెందిన 75 ఏళ్ల బత్త్తుల సరస్వతి సోమవారం మొరపెట్టుకుంది. ఒంటరిగా జీవిస్తున్న తనకు ఆధార్, రేషన్ కార్డులున్నాయని, రేషన్ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరింది. అందుకు స్పందించిన తహసీల్దార్.. ఇలాంటి సమస్యలు తమకు దృష్టికి వచ్చాయని, ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.