854 అడుగులకు రాగానే నీరు విడుదల: డిప్యూటీ సీఎం
ABN , First Publish Date - 2022-05-20T07:16:56+05:30 IST
శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం చేరగానే ఖరీఫ్ సీజన్కు సాగునీరు విడుదల చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ ఆంజాద్బాషా పేర్కొన్నారు.
నంద్యాల టౌన్, మే 19: శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం చేరగానే ఖరీఫ్ సీజన్కు సాగునీరు విడుదల చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ ఆంజాద్బాషా పేర్కొన్నారు. గురువారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సెంటీనరి భవనంలో కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ భరత్కుమార్రెడ్డి, ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిజా హర్షవర్ధన్రెడ్డి, డీఆర్వో పుల్లయ్య, జలవనరుల శాఖ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు రిజర్వాయర్లలో నీటి లభ్యతను బట్టి జూలై మొదటి వారంలోనే అన్ని కాల్వలకు నీరు విడుదల చేస్తామన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం చేరగానే నీరు విడుదల చేసి రిజర్వాయర్లను నింపి, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, హెచ్ఎన్ఎస్ఎస్ తదితర కాల్వల ద్వారా నీరు ఎప్పుడు విడుదల చేసేదీ కచ్చితమైన తేదీలు తెలియజేస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 812 అడుగుల నీటి సామర్థ్యం ఉందని తెలిపారు. జొళదరాశి, రాజోలి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుందూనది విస్తరణ పనులను వేగవంతం చేసి, అవసరమైన ప్రదేశాల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగునీటి కాల్వల కింద 1,76,309 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరందించేందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కేసీ కెనాల్ చివరి ఆయకట్టు భూములకు సాగునీటిని అందించాలన్నారు. సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ సర్కిల్ - 1, 2 పర్యవేక్షక ఇంజనీర్లు, నంద్యాల, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారులు, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.