హజ్ హౌస్పై ఇంత నిర్లక్ష్యమా...?
ABN , First Publish Date - 2022-06-25T05:18:05+05:30 IST
తెలుగుదేశం పాలనలో చేపట్టిన పవిత్రమైన హజ్హౌస్ భవనాన్ని మైనార్టీలకు అందుబాటులోకి తేకుం డా నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీఎ్స ముక్తియార్ అన్నారు.
27 కోట్లు ఖర్చు పెడితే వృథాగా వదిలేస్తారా...
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్ ముక్తియార్
చెన్నూరు, జూన్ 24: తెలుగుదేశం పాలనలో చేపట్టిన పవిత్రమైన హజ్హౌస్ భవనాన్ని మైనార్టీలకు అందుబాటులోకి తేకుం డా నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీఎ్స ముక్తియార్ అన్నారు. చెన్నూరు సమీపంలో హైవే పక్కన ఉన్న హజ్ హౌస్ భవనాన్ని రాష్ట్ర, జిల్లా టీడీపీ మైనార్టీ నేతలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముక్తియార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను కూల్చడం, నేతలపై కేసులు పెట్టడంతోనే కాలం గడుపుతోందని మండిపడ్డారు. ముస్లింలకు అందాల్సిన పథకాలను పాతిపెట్టేశారన్నారు. రూ.27కోట్లతో మూడేళ్ల క్రితం పూర్తి చేసి ప్రారంభించిన హజ్ హౌస్ భవనం వినియోగంలోకి తెచ్చి ఉంటే నేడు రాష్ట్రంలో ముస్లింలు హజ్ యాత్ర చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని ఉండేది కాదన్నారు. ఇక దుల్హన్ పథకానికి దిక్కు లేకుండా చేశారన్నారు. టీడీపీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్ మాట్లాడుతూ మూడేళ్ల వైసీపీ పాలనలో హజ్ భవనం చుట్టూ కంపచెట్లు, ముళ్లపొదలు పెరిగాయన్నారు. ఉర్దూ అకాడమీ, మైనార్టీ కార్పొరేషన్, మస్జీద్లో ప్రార్థనలకు హజరత్లు ఉండాల్సిన భవనంలో నేడు ఏమున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి జిల్లాలో ఉన్నా హజ్ హౌస్కు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అలీబేగ్, మాజీ కార్పొరేటర్ జాకీర్, కార్యదర్శి నజీర్, మండల మైనార్టీ నేతలు షబ్బీర్ అహ్మద్, మంజీర్ అహ్మద్, సుభాని, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, చెన్నూరు మండల కన్వీనర్ విజయభాస్కర్రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ గందం మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు.