కశ్మీర్ను ప్రత్యేకంగా ఉంచాలని పటేల్ అనుకున్నారా?
ABN , First Publish Date - 2021-10-18T23:24:39+05:30 IST
భారత్ నుంచి జమ్మూ కశ్మీర్ను ప్రత్యేకంగా ఉంచాలని సర్దార్ పటేల్ భావించినట్లు తారిఖ్ హమీద్ అన్నారు. అయితే జవహార్లాల్ నెహ్రూ మాత్రం కశ్మీర్ను భారత్లో ఉండాలని కోరుకున్నారు. దాని కోసం మహ్మద్ అలీ జిన్నా సహాయం తీసుకుని, కశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా ఉందని హమీద్ అన్నారు..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్పై కశ్మీర్కు చెందిన కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలని పటేల్ భావించారని అయితే జవహార్లాల్ నెహ్రూ చొరవతో కశ్మీర్లో భారత్లో భాగంగా ఉండిపోయిందని కశ్మీర్కు చెందిన కాంగ్రెస్ నేత తారిఖ్ హమీద్ కర్ర వ్యాఖ్యానించినట్లు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. గాంధీ కుటుంబం కారణంగా సర్దార్ పటేల్కు అప్పట్లో అవమానం జరిగిందని, ప్రస్తుతం కూడా అది కొనసాగుతూనే ఉందని పాత్రా అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘భారత్ నుంచి జమ్మూ కశ్మీర్ను ప్రత్యేకంగా ఉంచాలని సర్దార్ పటేల్ భావించినట్లు తారిఖ్ హమీద్ అన్నారు. అయితే జవహార్లాల్ నెహ్రూ మాత్రం కశ్మీర్ను భారత్లో ఉండాలని కోరుకున్నారు. దాని కోసం మహ్మద్ అలీ జిన్నా సహాయం తీసుకుని, కశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా ఉందని హమీద్ అన్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పత్రికల్లో కూడా వచ్చాయి. సోనియా గాంధీ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పటేల్పై ఇంత అవమానం జరిగినా గాంధీ కుటుంబానికి పట్టదా? గాంధీ కుటుంబం కాకుండా ఇంకెవరిపై విమర్శలు చేసినా కాంగ్రెస్కు పట్టింపు లేదా?’’ అని సంబిత్ పాత్రా ప్రశ్నించారు.
అయితే భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొన్ని వార్తా పత్రికలు కాంగ్రెస్ పార్టీపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. బీజేపీని, మోదీ ప్రభుత్వాన్ని కాకుండా ఎప్పుడూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రశ్నిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.