సంఘ్‌ పరివార్‌ అండ Etela Rajender కు కలిసొచ్చిందా..!?

ABN , First Publish Date - 2021-11-03T12:05:43+05:30 IST

టీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత..

సంఘ్‌ పరివార్‌ అండ Etela Rajender కు కలిసొచ్చిందా..!?

కరీంనగర్ : టీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత.. ఆయన వెంట ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగి తమ కేడర్‌ మొత్తాన్ని తిరిగి టీఆర్‌ఎస్‌ వైపు వచ్చేలా చూశారు. ఒకదశలో ఒంటరిగా మిగిలిన ఈటల రాజేందర్‌కు సంఘ్‌ పరివార్‌ అండగా నిలిచింది. ఆర్‌ఎస్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను రంగంలోకి దింపింది. వారు గ్రామాల్లో పర్యటించి జాతీయ భావాలు ఉన్న యువతీ, యువకులను సమీకరించి వారి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు పెట్టుకొని ఓటర్లుగా మలుచుకున్నారు.


కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించి వారి మద్దతు కూడగట్టారు. ప్రతి కుటుంబాన్ని కనీసం మూడుసార్లు కలిసి బీజేపీ మద్దతివ్వాలని కోరారు. ప్రతి గ్రామంలో పది కుటుంబాలకు ఒక ఇన్‌చార్జిని నియమించి నిత్యం వారితో టచ్‌లో ఉంటూ అధికార పార్టీవైపు మళ్లకుండా చూశారు. ఓటరు జాబితాలోని ఒక పేజీకి ఒక కమిటీని నియమించి దానిని పన్నా కమిటీగా పేర్కొన్నారు. ఆ కమిటీ తమ పరిధిలోని ప్రతి ఓటరును నిత్యం కలుస్తూ పార్టీ ఓటరు గా మార్చుకొని పోలింగ్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఓటు  వేయించుకునేంత వరకు బాధ్యత ను అప్పగించారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలుగా, సంఘ్‌పరివార్‌, ఏబీవీపీ కార్యకర్తలుగా పనిచేసి ఇప్పుడు దూరంగా ఉంటున్నవారిని కూడా సమీకరించి ఈటల రాజేందర్‌ గెలుపు కోసం కృషి చేశారు. పోలింగ్‌ రోజు పెద్ద ఎత్తున యువకులు మోహరించి ఎవైనా అక్రమాలు జరిగినట్లు తెలిస్తే వెంటనే అక్కడికి చేరుకుని నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు.

Updated Date - 2021-11-03T12:05:43+05:30 IST