ఏపీ నిజమే చెబుతోందా?

ABN , First Publish Date - 2022-05-14T08:09:44+05:30 IST

ఏపీ నిజమే చెబుతోందా?

ఏపీ నిజమే చెబుతోందా?

నిధుల మళ్లింపు లెక్కల మాటేమిటి?

తేల్చి చెప్పాలని కాగ్‌కు ‘సుప్రీం’ ఆదేశం

విపత్తు నిధుల మళ్లింపుపై విచారణ 

అఫిడవిట్‌ దాఖలు చేసిన ప్రభుత్వం


న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): ‘‘విపత్తు సహాయ నిఽధులను పీడీ ఖాతాలకు మళ్లించడంపై  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిజమే చెబుతోందా? ఆ విషయం తేల్చండి’’ అని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రూ.1100 కోట్ల విపత్తు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ను పరిశీలించి... అందులో ఉన్న వివరాలు నిజమో, కాదో తేల్చాలని కాగ్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ నిధుల నుంచి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే... ఆ నిధులను వ్యవసాయ శాఖ పీడీ ఖాతాలకు మళ్లించిందని పిటిషనర్‌ ఆరోపించారు. 


మళ్లింపు వాస్తవమే, కానీ: రాష్ట్ర ప్రభుత్వం

వ్యవసాయ శాఖ పీడీ ఖాతాలకు రూ.1100 కోట్లు మళ్లించడం నిజమేనని ప్రభుత్వం అంగీకరించింది. అయితే, ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఆ నిధులు ఇచ్చినందున వాటిని వ్యవసాయ శాఖ ఖాతాలకు బదిలీ చేశామని తెలిపింది. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌ శర్మ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘‘2018 ఖరీఫ్‌ సీజన్‌లో కరువు సహాయం కోసం రూ.1401.54 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. కానీ... కేంద్రం రూ.900.4 కోట్లే ఇచ్చింది. అందులో రూ. 759.98 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం కేటాయించింది. దీనికి రాష్ట్రం మరిన్ని నిధులు కలిపి రూ.1838.25 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రైతులకు చెల్లించాలని 2019 మార్చిలో నిర్ణయించింది. అయితే, ఎన్నికల కోడ్‌ తో సాధ్యపడలేదు. ఆ తర్వాత కరోనాను ఎదుర్కోడానికి ఆ నిధులను వినియోగించల్సి వచ్చింది. 759.98 కోట్లు దుర్వినియోగం కాకుండా.. ఆ మొత్తంతోపాటు రాష్ట్రం రూ.340.02 కోట్లను కలిపి వ్యవసాయ శాఖ కమిషనర్‌ పీడీ ఖాతాకు రూ.1100 కోట్లు బదిలీ చేసిం ది. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1838.25 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ... కరోనా కారణంగా మిగిలిన రూ.738.25 కోట్లను సర్దుబాటు చేయలేకపోయాం. దీనిపై కాగ్‌కు సమాధానం ఇచ్చాం. పిటిషనర్‌ ఆరోపించినట్లుగా నిధుల మళ్లింపు జరగలేదు’’ అని పేర్కొన్నారు. కాగా, నిధులు మళ్లించినట్లు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకు మార్చి 12న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి రాసిన లేఖపై పిటిషనర్‌ ఆధారపడ్డారని, ఈ లేఖతో ప్రస్తుత కేసుకు సంబంధం లేదని తెలిపారు. ఆ లేఖ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదని, కానీ కరోనా పరిహారం కోసం  2020-21 ఆర్థిక సంవత్సరంలో దాఖలవ్వగా గతేడాది జూన్‌ 30న తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేసిందని సమీర్‌ శర్మ వెల్లడించారు. కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడానికి రూ. 199.86 కోట్లు విడుదల చేశామన్నారు.

Read more