ప్రభుత్వ ఆస్తులు అమ్మడమే అభివృద్ధా?

ABN , First Publish Date - 2021-11-29T04:27:41+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే అభివృద్ధా అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. జనజాగరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారు.

ప్రభుత్వ ఆస్తులు అమ్మడమే అభివృద్ధా?
మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌

పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌

విజయనగరం(ఆంధ్రజ్యోతి), నవంబరు 28 : రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే అభివృద్ధా అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. జనజాగరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్‌ను భ్రష్టుపట్టించారన్నారు. జగన్‌ నిలకడలేని వ్యక్తిగా శైలజానాథ్‌ అభివర్ణించారు. అందుకే అమరావతి విషయంలో వెనుకడగు వేసారని గుర్తుచేశారు. ఎయిడెడ్‌ పాఠశాలలను తొలగిస్తే వాటి ఆస్తులను అమ్మేయవచ్చన్న దురాశతో వైసీపీ ప్రభుత్వం ఉందని, విద్యార్థులు, ప్రజలు తిరగబడటంతో ఏ నిర్ణయం బయటకు చెప్పడం లేదన్నారు. అప్పులు చేయడంలో జగన్‌ రికార్డు సృష్టిస్తున్నారని, కాగ్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని దుయ్యబట్టారు. సీమ జిల్లాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారని, వేలాది కుటుంబాలు నిరాశ్రయులై, ఆహాకారాలు పెడుతున్నారని, వారిని కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తే ఇప్పుడు ఓటీఎస్‌ పేరుతో వేలాది రూపాయాలు లాక్కొంటున్నారన్నారు. శాసనసభలో ప్రజా ప్రతినిధులు వాడుతున్న భాషను చూసి సభ్యసమాజం సిగ్గుతో తల దించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిపై కాంగ్రెస్‌ అప్పట్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ వెనుకబడిన విషయం నిజమే అయినా ఉత్తరాంధ్రతోపాటు మరికొన్ని జిల్లాల్లో యువరక్తంతో కాంగ్రెస్‌ పుంజుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్‌, విజయనగరం నగర అధ్యక్షుడు సుంకరి సతీష్‌కుమార్‌, బొడ్డు శ్రీను, పి.శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-29T04:27:41+05:30 IST