ధాన్యం కమీషన్ అందేనా?
ABN , First Publish Date - 2022-01-21T06:12:47+05:30 IST
కొవిడ్ సమయంలో కూడా అనేక ఇబ్బందులకు ఓర్చి ధాన్యం కొనుగోళ్లు నిర్వహించిన ఐకేపీ, సహకార సంఘాలు, మెప్మా, డీసీఎంఎస్, మార్కెట్ కమిటీలకు పౌరసరఫరాల శాఖ నుంచి వచ్చే ధాన్యం కమీషన్ కోసం నిరీక్షించక తప్పడం లేదు.
- మూడు సీజన్ల బకాయిలు రూ. 26.05 కోట్లు
- ఐకెపీ, సింగిల్ విండో నిర్వాహకుల ఎదురు చూపులు
- కమీషన్ చెల్లింపులో పౌరసరఫరాల జాప్యం
- వానాకాలం సీజన్ రైతులకు ధాన్యం బకాయిలు రూ.19.58 కోట్లు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
కొవిడ్ సమయంలో కూడా అనేక ఇబ్బందులకు ఓర్చి ధాన్యం కొనుగోళ్లు నిర్వహించిన ఐకేపీ, సహకార సంఘాలు, మెప్మా, డీసీఎంఎస్, మార్కెట్ కమిటీలకు పౌరసరఫరాల శాఖ నుంచి వచ్చే ధాన్యం కమీషన్ కోసం నిరీక్షించక తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు సీజన్లకు కలిపి రూ 26.05 కోట్ల బకాయిలు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రావాల్సి ఉంది. కమీషన్ ఎప్పుడు విడుదల చేస్తుందోనని ఎదురు చూడక తప్పడం లేదు. పౌరసరఫరాల జాప్యానికి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొవిడ్ సమయంలో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ పూర్తి చేశారు. సమృద్ధిగా వర్షాలు, భూగర్భ జలాలు పెరగడం కాళేశ్వరం ఎత్తిపోతల జలాలతో ధాన్యం దిగుబడి పెరిగింది. ప్రస్తుతం ముగిసిన వానాకాలం సీజన్లో 257 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,76,301 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 54,119 మంది రైతుల నుంచి రూ. 541.55 కోట్ల విలువైన ధాన్యం సేకరించి రైతులకు రూ.521.68 కోట్లు చెల్లించారు. కొనుగోళ్లు పూర్తయిన 2563 మంది రైతులకు రూ.19.58 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. రైతుల చెల్లింపులు ప్రతి సీజన్లోనే పూర్తి చేస్తుండగా ధాన్యం సేకరించిన కేంద్రాలకు మాత్రం వచ్చే కమీషన్ను సకాలంలో చెల్లించకపోవడంతో నిర్వాహకులకు భారంగా మారింది.
పెండింగ్లోనే మూడు సీజన్ల కమీషన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు సీజన్లకు కలిపి రూ 26.05 కోట్లు కమీషన్ రూపంలో రావాల్సి ఉంది. ఒక క్వింటాలుకు రూ.32 చొప్పున ఏ గ్రేడ్కు చెల్లిస్తే, బి గ్రేడ్కు రూ.31.25 పైసలు చెల్లిస్తారు. 2020-21 సంవత్సరంలో ఖరీఫ్ సాగుకు సంబంధించి 226 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,76,552 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.5కోట్ల 64 లక్షల 96 వేల 803 కమీషన్ రావాల్సి ఉంది. 62 ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరించిన 47,883 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ. కోటి 53 లక్షల 22 వేల 494 కమీషన్ రావాల్సి ఉంది. 7 డీసీఎంస్ కేంద్రాల్లో ధాన్యం 3,441మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.11 లక్షల 1325లు, 5 మార్కెట్ యార్డుల ద్వారా 4,429 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ. 14 లక్షల 17,510 కమీషన్ రావాల్సి ఉంది. 150 సింగిల్ విండోల ద్వారా 1,19,199 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.3 కోట్ల 81 లక్షల 43,922, రెండు మెప్మా కేంద్రాల ద్వారా 1,598 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.5,11,552 కమీషన్ రావాల్సి ఉంది. 2020- 21 రబీ సీజన్కు సంబంధించి 236 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,61,383 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.11 కోట్ల 56 లక్షల 33 వేల 774 కమీషన్ రావాల్సి ఉంది. 58 ఐకెపీ కేంద్రాల ద్వారా సేకరించిన 83,871 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.2కోట్ల 68 లక్షల 36 వేల 383 బకాయిలు ఉండగా, 7 డీసీఎంస్ కేంద్రాల్లో ధాన్యం 8,468 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.27 లక్షల 10,042లు, 7 మార్కెట్ యార్డుల ద్వారా 9,230 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ. 29 లక్షల 53,760 లక్షలు రావాల్సి ఉంది. 162 సింగిల్ విండోల ద్వారా 2,55,840 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.8 కోట్ల 18 లక్షల 62,473, రెండు మెప్మా కేంద్రాల ద్వారా 3,972 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.12,71,117 కమీషన్ రావాల్సి ఉంది. తాజాగా 2021- 22వానాకాలం సీజన్కు సంబంధించి 257 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,76,301 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. దీనికి సంబంధించి రూ.8 కోట్ల 84 లక్షల 16 వేల 396 కమీషన్ రావాల్సి ఉంది. ఇందులో 58 ఐకెపీ కేంద్రాల ద్వారా 65,460 మెట్రిక్ టన్నులకు రూ. 2 కోట్ల 9 లక్షల 47,456 కమీషన్ రావాల్సి ఉండగా, 185 సింగిల్ విండోల ద్వారా 1,98,392 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ. 6 కోట్ల 34 లక్షల 85 వేల 670 కమిషన్ బకాయిలు ఉన్నాయి. డీసీఎంఎస్ 9 కేంద్రాల ద్వారా 7,252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా కమీషన్ రూ.23,2,0440 రావాల్సి ఉంది. మూడు మెప్మా కేంద్రాల ద్వారా 3,083 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగగా కమీషన్ రూ.9,86,860, రెండు మార్కెట్ యార్డుల ద్వారా 2,111 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగగా రూ.6,75,769 ధాన్యం కమీషన్ రావాల్సి ఉంది. ధాన్యం కమీషన్ సకాలంలో రాకపోవడంతో సహకార, ఐకేపీ సంఘాలు ఇబ్బందులు పడుతున్నాయి. కమీషన్ విడుదల చేస్తే సంఘాలకు ఆర్థిక చేయూత లభిస్తుందని విడుదల చేయాలని కోరుతున్నారు.