ప్రతి ఎకరాకు సాగునీరు కలేనా?
ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST
పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సూక్ష్మనీటి సేద్యం పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 2.32 లక్షల ఎకరాల్లో ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో మొదటి విడతగా
పులివెందుల నియోజకవర్గంలో మొదటి విడతలోనే ఆగిన పనులు
సూక్ష్మనీటి సేద్యం పూర్తయితేనే సస్యశ్యామలం
పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో సూక్ష్మనీటి సేద్యం పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. మొదటి విడతగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి ఇప్పటికి 13 ఏళ్లు గడుస్తున్నా మొదటి విడత పనులు కూడా పూర్తి కాలేదు. సూక్ష్మనీటి సేద్యం పనులు పూర్తయితేనే సస్యశ్యామలం అవుతుంది.
పులివెందుల, మార్చి 7: పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సూక్ష్మనీటి సేద్యం పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 2.32 లక్షల ఎకరాల్లో ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో మొదటి విడతగా 25 వేల ఎకరాలు, రెండో విడతలో లక్ష, మూడో విడతలో మిగిలిన ఎకరాలకు ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టింది. రూ.80 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభించింది. ఈ పనులు పైడిపాళెం ప్రాజెక్టు కింద 10 వేల ఎకరాలు, పీబీసీ కింద 10 వేల ఎకరాలు, లింగాల కుడికాల్వ కింద 5 వేల ఎకరాల్లో చేపట్టారు. ఈ పథకం ఉద్దేశం ప్రతి వంద ఎకరాలకు సిమెంటు లైనింగ్ వేసిన సంపు ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి పంట పొలాలకు పైప్లైన ద్వారా తుంపర, బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తారు. 10 ఎకరాలకు ఒక మోటార్ ఏర్పాటు చేస్తారు. కాల్వ ద్వారా వచ్చిన నీరు సంపునకు చేరి అక్కడి నుంచి పైప్లైన ద్వారా పంట పొలాలకు అందిస్తారు. ఉన్న నీటిని ఎక్కువ విస్తీర్ణానికి అందించేలా ఈ ప్రాజెక్టు రూపొందించారు. అయితే వైఎస్ మరణం అనంతరం 2009 నుంచి 2013 వరకు పనులు నత్తనడకన సాగాయి. అనంతరం బిల్లులు కాలేదనే నెపంతో కాంట్రాక్టర్లు పనులు పూర్తిగా నిలిపేశారు. చేసిన పనులు కూడా నాశిరకంగా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయుడు వైఎస్ జగనమోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సూక్ష్మనీటి సేద్యం పనులకు ప్రతిపాదనలు సిద్థం చేసినా అవి పట్టాలెక్కలేదు. ఇంకా టెండర్లు పూర్తి చేసుకుని పనులు ప్రారంభం కాలేదు. ఏది ఏమైనా ఈ పథకం పూర్తి స్థాయిలో అమలైతే పులివెందుల సస్యశ్యామలం కావడం తథ్యం.