ఆసుపత్రి నుంచి ఇషాన్ కిషన్ డిశ్చార్జ్.. నేటి మ్యాచ్లో ఆడడం డౌటే!
ABN , First Publish Date - 2022-02-27T21:53:24+05:30 IST
శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20లో తలకు గాయమై ఆసుపత్రిలో చేరిన టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్
ధర్మశాల: శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20లో తలకు గాయమై ఆసుపత్రిలో చేరిన టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, నేటి మ్యాచ్లో ఆడడం మాత్రం అనుమానంగానే ఉంది. నిన్నటి మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఈ ఘటన జరిగింది. లహిరు కుమార వేసిన బౌన్సర్ ఇషాన్ హెల్మెట్కు బలంగా తాకింది. వెంటనే శ్రీలంక ఫీల్డర్లు ప్రాథమిక చికిత్స అందించారు.
ముందు జాగ్రత్త చర్యగా ఆ తర్వాత అతడిని హిమాచల్ ప్రదేశ్ కంగ్రాలోని ఆసుపత్రి సాధారణ వార్డులో చేర్చారు. అనంతరం సీటీ స్కాన్ తీశారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేటి చివరి టీ20కి అతడు అందుబాటులో ఉండేది, లేనిది తెలియరాలేదు.