Bangladesh Communal clashes : హిందూ దేవాలయం, ఇళ్లు అగ్నికి ఆహుతి

ABN , First Publish Date - 2022-07-17T19:27:02+05:30 IST

బంగ్లాదేశ్‌లో మరోసారి ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోయారు. ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ఇస్లాంకు వ్యతిరేకంగా

Bangladesh Communal clashes : హిందూ దేవాలయం, ఇళ్లు అగ్నికి ఆహుతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో మరోసారి ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోయారు. ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ, హిందూ దేవాలయంపైనా, హిందువుల ఇళ్ళపైనా విచక్షణారహితంగా దాడులు చేసి, నిప్పు పెట్టారు. ఈ సంఘటన శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిందని పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. 


Bangladesh పోలీసు అధికారి హరన్ చంద్ర పౌల్ తెలిపిన వివరాల ప్రకారం, నరాయిల్ జిల్లా, డిఘోలియా గ్రామంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం మైనారిటీ హిందువుల దేవాలయం, ఇళ్ళపై ఇస్లామిస్టులు దాడులు చేశారు. ఓ హిందూ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని ఇస్లామిస్టులు ఆరోపించారు. ఓ హిందూ కుటుంబానికి చెందిన ఇంటిని తగులబెట్టారు. 


దాడులకు పాల్పడుతున్న ఇస్లామిస్టులను చెదరగొట్టేందుకు గాలిలోకి కాల్పులు జరిపినట్లు హరన్ తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ ప్రబిర్ కుమార్ రాయ్ మాట్లాడుతూ, పరిస్థితిని అదుపులోకి తేవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ హింసాకాండకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. అయితే Facebook పోస్ట్ పెట్టిన ఆకాశ్ సాహాను, ఆయన తండ్రి అశోక్ సాహాను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. 


బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తరచూ జరుగుతున్నాయి. హాజీ సైఫుల్లా నాయకత్వంలో దాదాపు 200 మంది ఇస్లామిస్టులు మార్చి నెలలో ఢాకాలోని ఇస్కాన్ దేవాలయంపై దాడి చేశారు. దేవీ, దేవతల విగ్రహాలను అపవిత్రం చేసి,  ధ్వంసం చేశారు. దేవాలయం ప్రాంగణాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ దేవాలయంలో ఉన్న భక్తులపై కూడా దాడి చేశారు. 


బంగ్లాదేశ్‌లో హిందువులపై తరచూ దాడులు జరుగుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితులను పోలీసులు అరెస్టు చేస్తున్నప్పటికీ, మతోన్మాదులు దాడులను కొనసాగిస్తున్నారు. 


Updated Date - 2022-07-17T19:27:02+05:30 IST