ఐసోలేషన్ కేంద్రాలు.. ర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-05-10T04:35:33+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గ
గద్వాల, మే 10 ఆంధ్రజ్యోతి: జోగుళాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైరస్ సోకిన వారిని అడ్మిట్ చేసుకోడానికి అవసరమైన బెడ్స్ లేవు. సీరియస్ ఉన్న వారికి 45 బెడ్స్లో చికిత్స అందిస్తున్నారు. గద్వాలలో పీజీ కళాశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ మండలాలు, గ్రామాల వారు ఇక్కడ ఐసోలేషన్లో ఉండాలంటే కష్టంగా భావిస్తున్నారు. కొందరు పారిపోతున్నారు. గద్వాల ఆస్పత్రి నుంచి ఇటీవలె ఎనిమిది మంది పారిపోయారు. ఈ నేపథ్యంలో మండలాల వారీగా కాకున్న మునిసిపాలిటీల్లోనైనా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.
ఇరుకు ఇళ్లతో ఇబ్బంది
ప్రస్తుతం గ్రామాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఇరుకు ఇరుకు ఇండ్లు ఉన్న వారికి పాజిటివ్ వస్తే అక్కడ ఉండటం ఇబ్బందిగా ఉందని, మునిసిపాలిటీల వారీగా అన్ని వసతులతో అసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా చేస్తే కరోనాను కొద్ది మేరకు తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం వివాహాలు అంతగా జరగడం లేదు. కల్యాణ మంటపాలు, విశాలమైన గోదాంలలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, దాతలను గుర్తించి భోజనం, మిగతా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయమై కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.
అయిజలో ఐసోలేషన్ కేంద్రంపై వివాదం
అయిజ మునిసిపాలిటీలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి కలెక్టర్కు విజ్ఞప్తి వచ్చింది. ఆ మేరకు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా వైద్యాధికారి చందు నాయక్ అంగీకరించారు. మూడు రోజుల కిందట చందూ నాయక్ వెళ్లి పాఠశాలను చూసి వచ్చారు. విషయం తెలుసుకున్న హైస్కూల్ చుట్టు పక్కల ఉన్న ప్రజలు ఇక్కడ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయొద్దని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జూనియర్ కళాశాల, కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేయడానికీ అంగీకరించడం లేదు. గతంలో కస్తూర్బా పాఠశాలలో ఐసోలేషన్ ఏర్పాటు చేస్తే పరిసరాలను అపరిశుభ్రంగా మార్చారని, మరోసారి ఆ పాఠశాలలో ఏర్పాటు చేయొద్దని అంటున్నారు. ఇదే పరిస్థితి జూనియర్ కళాశాలలోనూ నెలకొంది.
కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం
ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు విషయమై హైస్కూల్ చుట్టు పక్కల ఉన్న ప్రజలతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులు ఆదివారం అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో నాయకులు అక్కడి నుంచి వెనక్కి వచ్చారు. ఈ వివాదం ఇలా కొనుసాగుతుంటే ఐసోలేషన్ కేంద్రం పెట్టిస్తామంటే అధికార పార్టీ వాళ్లు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ అడ్డుకోవడాలు ఏమీ లేవని, అయిజలో అసోలేషన్ ఏర్పాటు చేయాలని మేము కూడా కోరుకుంటున్నామని అధికార పార్టీ వాళ్లు అభిప్రాయపడుతున్నారు.