శుక్రగ్రహంపై పరిశోధనలు.. సరికొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ఇస్రో

ABN , First Publish Date - 2022-05-05T03:34:44+05:30 IST

న్యూఢిల్లీ : భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా ఇనుమడింప చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బృహత్తర ప్రణాళికను ప్రకటించింది.

శుక్రగ్రహంపై పరిశోధనలు.. సరికొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ఇస్రో

న్యూఢిల్లీ : భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా ఇనుమడింప చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బృహత్తర ప్రణాళికను ప్రకటించింది. ఇప్పటికే చంద్రుడు, అంగారక గ్రహాల మీద ప్రయోగాలు చేపట్టిన ఇస్రో.. 2024 డిసెంబర్ నాటికి శుక్రగ్రహంపై పరిశోధనలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘ ఇస్రో వీనస్ మిషన్ 2024’ను ప్రకటించింది. సౌరవ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే శుక్రగ్రహం ఉపరితలం కింద ఏముందో కనిపెట్టాలని ఇస్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది. మిషన్ కోసం అంతరిక్ష వాహన నౌకను సిద్ధం చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. వీనస్ మిషన్‌కు అంకురార్పణ చేశామన్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైందని వివరించారు. అత్యుత్తమ ఫలితాలు రాబట్టడంపై దృష్టిసారించాలని శాస్త్రవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. తక్కువ కాలవ్యవధిలోనే  వీనస్ మిషన్‌ను రూపొందించడం, ప్రవేశం పెట్టడం భారత్‌కు సాధ్యమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌కు ఆ శక్తిసామర్థ్యాలు ఉన్నాయని సోమనాథ్ చెప్పారు. ఈ మిషన్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. 2024 డిసెంబర్‌లో భూమి, శుక్రగ్రహం సమాంతర రేఖపైకి రానున్నాయి. ఈ సమయంలో అంతరిక్ష నౌకను తక్కువ ఖర్చుతోనే శుక్రగ్రహం కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది. ఇలాంటి అవకాశం మళ్లీ 2031 వస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

Read more