చిన్నోడిపై ఇస్రో గురి..!
ABN , First Publish Date - 2022-08-03T09:02:57+05:30 IST
చిన్నోడిపై ఇస్రో గురి..!
బాహుబలి నుంచి బుల్లి రాకెట్ వైపు
అంతరిక్ష వాణిజ్యం దిశగా ఇస్రో అడుగులు
30 కోట్లతోనే ఎస్ఎస్ ఎల్వీ తయారీ
ఆరుగురితోనే ప్రయోగించే సౌలభ్యం
ఇస్రో వినూత్న రాకెట్ ఎస్ఎస్ ఎల్వీ
శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఆగస్టు 2: బాహుబలి లాంటి (జీఎ్సఎల్వీ-మార్క్3) 630 టన్నుల బరువు కలిగిన రాకెట్లను అలవోకగా అంతరిక్షంలోకి పంపిస్తున్న ఇస్రో ఇప్పుడు 120 టన్నుల బుల్లి రాకెట్ (ఎస్ఎ్సఎల్వీ) వైపు గురిపెట్టింది. ప్రపంచ అంతరిక్ష వాణిజ్యాన్ని గుప్పిటపట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తొలిసారిగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎ్సఎల్వీ)ను ఈ నెల 7న రోదసిలోకి పంపిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...
43 ఏళ్ల క్రితం 1979లో ఇస్రో 17 టన్నుల ఎస్ఎల్వీతో ఉపగ్రహాలను రోదసిలోకి పంపే కసరత్తు ప్రారంభించింది. అంచెలంచెలుగా 40 టన్నుల ఎఎ్సఎల్వీ, 320 టన్నుల పీఎ్సఎల్వీ, 414 టన్నుల జీఎ్సఎల్వీ, 630 టన్నుల జీఎ్సఎల్వీ-మార్క్3 రాకెట్లను ప్రయోగించే స్థాయికి ఎదిగింది. ఇలా ఈ రాకెట్ల ద్వారా ఈ 43 ఏళ్లల్లో 427 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసింది. వీటిలో 345 విదేశీ ఉపగ్రహాలే కావడం విశేషం. అయితే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎ్సఎల్వీ) రాకెట్ అందుబాటులోకొచ్చిన తర్వాతే ఇస్రో ప్రయోగాల్లో వేగం, కచ్చితత్వం పెరిగాయి. విదేశీ ఉపగ్రహాలను పీఎ్సఎల్వీతోనే సురక్షితంగా కక్ష్యల్లోకి చేరవేసింది. ప్రపంచంలో కారుచౌకగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసే దేశంగా పేరు సాధించింది. ఇస్రో ఇప్పుడు మరింత చౌకగా... మరింత వేగంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికోసం పీఎ్సఎల్వీ తరహాలోనే అతి తక్కువ ఖర్చుతో ఎస్ఎ్సఎల్వీని రూపొందించింది.
2016 నుంచే సన్నాహాలు..
2016లో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్డ్ స్టడీ వ్యవస్థాపకులు రాజారామ్ రాజప్ప చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు చిన్న రాకెట్ అవసరాన్ని గుర్తించి ఇస్రోకు నివేదిక సమర్పించారు. అదే ఏడాది నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియంలో అప్పటి ఇస్రో ఎల్పీఎ్ససీ సెంటర్ డైరెక్టర్ (ప్రస్తుత ఇస్రో చీఫ్) ఎస్. సోమనాథ్ దేశానికి చిన్న రాకెట్ అవసరాన్ని ప్రస్తావించి ఇస్రో ఈ రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టేలా చేశారు.
2018లో నాలుగు దశల మోటార్లతో ఈ రాకెట్ డిజైన్ను త్రివేండ్రంలోని విక్రమ్సారాబాయి స్పేస్ సెంటర్ రూపొందించింది.
2020 నుంచి ఈ రాకెట్కు వివిధ భూస్థిర పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం రోదసిలోకి ప్రయోగిస్తున్నారు.
ఎస్ఎ్సఎల్వీ రాకెట్ తయారీ ప్రయోగాల కోసం రూ.169 కోట్లు ఖర్చు చేశారు.
రూ.30 కోట్లతో ఎస్ఎ్సఎల్వీ రాకెట్ను తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు.
జీఎ్సఎల్వీ, పీఎ్సఎల్వీలతో పోలిస్తే..
జీఎ్సఎల్వీ రాకెట్ తయారీకి రూ.130 కోట్ల నుండి 200 కోట్ల వరకు ఖర్చయితే.. ఎస్ఎ్సఎల్వీకి రూ.30 కోట్లే అవుతుంది. పీఎ్సఎల్వీ రాకెట్ తయారీకి 3 నుంచి 4 నెలలు పడితే, ఎస్ఎ్సఎల్వీకి 7 రోజుల నుంచి 30 రోజులు పడుతుంది. పీఎ్సఎల్వీ రాకెట్ అనుసంధానానికి 35రోజులు పడుతుంది. ఎస్ఎ్సఎల్వీకి 24 నుంచి 74 గంటలు సరిపోతాయి. పీఎ్సఎల్వీ ప్రయోగానికి 600 మంది అవసరం. ఎస్ఎ్సఎల్వీ ప్రయోగాన్ని ఆరుగురితో నిర్వహించవచ్చు.
భవిష్యత్తులో ప్రైవేట్ రంగం ద్వారా
ఎస్ఎ్సఎల్వీ రాకెట్ తయారీతోపాటు ప్రయోగ సన్నాహాలు, ఇస్రో వాణిజ్య విభాగం ఎన్ఎ్సఐఎల్ (న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశీయ ప్రైవేట్ రంగ సంస్థలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఈ రాకెట్ను తయారు చేయించి ఇస్రో ద్వారా ఎన్ఎ్సఐఎల్ ప్రయోగించనుంది. ఎస్ఎ్సఎల్వీ రాకెట్ను ప్రస్తుతం షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగిస్తున్నా, రాబోయే రోజుల్లో ఈ రాకెట్ ప్రయోగానికి ప్రత్యేక వేదికలు సమకూర్చుకుంటున్నారు. దీనికి ఎస్ఎ్సఎల్సీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ కాంప్లెక్స్) నిర్మాణ సన్నాహాలు షార్లో జరుగుతున్నాయి. తమిళనాడులోని కులశేఖర పట్టణంలో ఇస్రో నిర్మిస్తున్న ప్రయోగ కేంద్రం సిద్ధమైన తదుపరి ఎస్ఎ్సఎల్వీ రాకెట్లను అక్కడి నుంచే ప్రయోగించనున్నట్లు సమాచారం.
ఇదీ ఎస్ఎస్ ఎల్వీ స్వరూపం
ఎత్తు: 34 మీటర్లు వెడల్పు: 2 మీటర్లు
బరువు: 120 టన్నులు
దశలు: 4 (1 నుంచి 3 దశలు ఘన ఇంధనంతో, చివరి నాలుగో దశ ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి)
సామర్థ్యం : 500 కిలోల లోపు బరువున్న ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల ఎత్తులోని తక్కువ భూకక్ష్యలోకి, 350 కిలోలలోపు బరువున్న ఉపగ్రహాలను 600 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యసమస్థితి కక్ష్యలోకి చేరవేస్తుంది.
బుల్లి రాకెట్లో చిన్నారి శాస్త్రవేత్తల శాటిలైట్
750 మంది బాలికలు తయారు చేసిన ఆజాదీశాట్.. 7న నింగిలోకి
ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి థీమ్ అంతరిక్షంలో మహిళలు. దానికి అనుగుణంగా చెన్నైకి చెందిన స్పేస్కిడ్జ్ ఇండియా మనదేశ బాలికలతో ఆజాదీశాట్ అనే ఉపగ్రహాన్నే తయారు చేయించింది. దేశవ్యాప్తంగా 75 పాఠశాలల్లో 8 నుంచి 12వ తరగతి వరకు చదివే 750 మంది విద్యార్థినులను ఎంపిక చేసింది. వారికి ఉపగ్రహాన్ని తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. మనదేశానికి చెందిన హేక్టావేర్ టెక్నాలజీ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు ఈ బృహత్కార్యానికి సమకూర్చింది. ఈ నెల 7న ఇస్రో ప్రయోగించనున్న ఎస్ఎ్సఎల్వీ రాకెట్లో ఈ ఆజాదీశాట్ను కక్ష్యలోకి చేరవేయనున్నారు.
తెలుగు బాలికల పాత్ర..
ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన 8 పాఠశాలల విద్యార్థులు ఈ ఉపగ్రహ తయారీలో పాల్గొన్నారు. ఏపీలోని తిరుపతి జిల్లా నారాయణవనం జడ్పీ బాలికోన్నత పాఠశాల, తూర్పుగోదావరి జిల్లా వీరలంకపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం, అనంతపురం జిల్లాలోని కురుగుండ ఏపీఎ్సడబ్ల్యూఆర్ స్కూల్ విద్యార్థులు ఇంఉదలో భాగస్వాములయ్యారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని జడ్పీహెచ్ఎ్స బాలికోన్నత పాఠశాల, సికింద్రాబాద్లోని ఎస్టీ ఫ్రాన్సిస్ బాలికోన్నత పాఠశాల, వరంగల్ జిల్లా గుర్జకుంటలోని జడ్పీహెచ్ఎ్స ఎండి చెరియల్ స్కూల్, ఖమ్మం జిల్లా ఎర్రుపాళెంలోని టీఎ్సడబ్ల్యూఆర్ఎ్స-జూనియర్ కాలేజీ, హైదరాబాద్లోని జీహెచ్ఎ్స స్కూల్ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. బాలికలే రూపొందించిన ఈ ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. ఈ శాటిలైట్ రోదసిలో సంచరిస్తూ వాతావరణ సమాచారాన్ని రేడియో ధార్మికతతో పాటు ఫొటోలు తీసి పంపిస్తుంది.