ఐటీ కంపెనీల నయా రూటు!
ABN , First Publish Date - 2021-04-12T08:43:43+05:30 IST
కొవిడ్ సమయంలో తమ సేవలను మరింత విస్తృతపరచటానికి ఐటీ కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయిస్తూ
జాయింట్ వర్క్స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తు
ఉద్యోగుల సొంత ప్రాంతాలకు దగ్గరగా ఆఫీసు వాతావరణం కల్పించే దిశగా అధ్యయనం
సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న ఐటీ సంస్థలు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
కొవిడ్ సమయంలో తమ సేవలను మరింత విస్తృతపరచటానికి ఐటీ కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయిస్తూ ఉత్పాదకతను గణనీయంగా పెంచుకున్న పలు సంస్థలు ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు దగ్గరగా ప్రధాన పట్టణాల్లో పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. రెండు, మూడు కంపెనీలు కలసి వీటిని ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) కూడా ఈ అంశాన్ని ధ్రువీకరిస్తోంది. అయితే వర్క్స్టేషన్ల అంశం ఇంకా ఆలోచనల దశలోనే ఉందని చెబుతోంది.
రెండు తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 6లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో బీపీఓ, టెక్నికల్, సర్వర్ సంబంధ విభాగాల్లో పనిచేసే వారు తప్ప మిగిలిన 80శాతం మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత గతం కంటే పెరిగిందని నాస్కామ్ పేర్కొంటోంది. కరోనా తగ్గుముఖం పడుతున్న దశలో ఉద్యోగుల సొంత ప్రాంతాలకు దగ్గరగా వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు ఐటీ కంపెనీలు ఆలోచన చేశాయి.
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
రెండు, మూడు ఐటీ కంపెనీలు కలసి తమ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు అత్యంత సమీపంగా పట్టణాల్లో ఈ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాయి. వాటిలో పూర్తిగా ఆఫీస్ లుక్ను తీసుకురావటంతో పాటు, వర్క్ చాంబర్లు, వర్క్ గ్రూప్లను తీర్చిదిద్దుతారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటాయి. సొంత ప్రాంతానికి దగ్గరలోనే పనిచేస్తున్నామన్న భావన ఉద్యోగుల్లో ఉంటుంది.
ఇంటి దగ్గర నుంచి కాకుండా ఈ వర్క్ స్టేషన్లకు వచ్చి వారు పని చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను ఐటీ కంపెనీలు పరిశీలిస్తున్నాయి. వేర్వేరు సంస్థల ఉద్యోగులు ఒకేచోట పనిచేయడం వల్ల సంస్థకు నష్టదాయకంగా ఉండే చర్యలను ఎలా నివారించవచ్చనే దానిపైనా మదింపు చేస్తున్నాయి. ముఖ్యమైన డేటా ఇతర కంపెనీల ఉద్యోగులు తెలుసుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. అందువల్ళ భిన్నమైన సర్వీసులను అందించే వేర్వేరు కంపెనీలు కలిసి వర్క్స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నాయి. కరోనా సంక్షోభం సర్వీసు సెక్టార్పై లేకపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఐటీ కంపెనీలు కొత్త జోష్తో ఉన్నాయి. సొంత ప్రాంతాలకు దగ్గర్లో పని చేసేందుకు వీలుగా 1,000మంది ఉద్యోగుల కోసం హెచ్సీఎల్ సంస్థ ఇటీవల విజయవాడ, తెలంగాణలో మెగా జాబ్మేళా నిర్వహించింది.
ప్లగ్ అండ్ ప్లే స్టేషన్లు
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్ ్క ఆఫ్ ఇండియా(ఎ్సటీపీఐ) సూక్ష్మ, చిన్న ఐటీ కంపెనీల కోసం వర్క్ స్టేషన్ల తరహాలోనే ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని ఇప్పటికే తెలుగు రాష్ర్టాల్లో అమల్లోకి తెచ్చింది. వీటిని ప్లగ్ అండ్ ప్లే స్టేషన్లు అంటారు. ఆఫీసు వాతావరణం ఉండే వీటిని సీటింగ్ ప్రాతిపదికన అద్దెకు ఇస్తుంటారు. ఏపీలో విజయవాడలో విన్సిటీ ఈ కోవలోకే వస్తుంది.
వర్క్ ఫ్రం హోంకే ప్రాధాన్యం
ఐటీ ఉద్యోగులు దాదాపు 13నెలలుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈ విధానంలో ఉత్పాదకత పెరిగిన మాట వాస్తవం. దీనివల్ల సేవల రంగానికి ఇంకా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల భద్రత దృష్ట్యా వర్క్ ఫ్రం హోంకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాం. కొన్ని ఐటీ కంపెనీలు వర్క్స్టేషన్ల ఆలోచనలు చేస్తున్నా అవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. కొవిడ్ పరిస్థితులు మెరుగుపడితే అవి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
శ్రీకాంత్ శ్రీనివాసన్, సీనియర్ డైరెక్టర్, నాస్కామ్