దేశానికే ఆదర్శంగా నిలువడం గర్వకారణం

ABN , First Publish Date - 2022-06-28T05:27:11+05:30 IST

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) దేశానికే ఆదర్శంగా నిలవడంతో గర్వకారణమని కేడీసీసీబీ, టెస్కాబ్‌, నాప్‌స్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

దేశానికే ఆదర్శంగా నిలువడం గర్వకారణం
సమావేశంలో మాట్లాడుతున్న కొండూరు రవీందర్‌రావు

- ప్రతి సంఘానికి రూ.50 లక్షల నిధులు 

- కేడీసీసీబీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు 

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 27:  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) దేశానికే ఆదర్శంగా నిలవడంతో గర్వకారణమని కేడీసీసీబీ, టెస్కాబ్‌, నాప్‌స్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. సోమవారం నిర్వహించిన బ్యాంకు సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, సమష్టికృషి ఫలితంగా బ్యాంకు లాభాల్లో ఉందని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పలనలోకూడా ముందంజలోనే ఉన్నామని చెప్పారు. రైతులకు పంటరుణాలు అందించడంతోపాటు వారికి అవసరమైన ఇతర సేవలందించాలని సూచించారు. సెక్రెటరీలు లేని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అధ్యక్షులు శ్రద్ధ తీసుకొని సభ్యులకు సేవలందించాలన్నారు. బ్యాంకు సభుల్యకు 6.5 శాతం డివిడెండ్‌ ఇవ్వాలని తీర్మానం చేశామని, ఆ మేరకు సంఘాల్లో సభ్యులకు డివిడెండ్‌ ఇవ్వాలని అన్నారు. కర్షక మిత్ర పథకం ద్వారా ప్రతి సంఘానికి 50 లక్షల చొప్పున నిధులను కేంద్ర సహకార బ్యాంకు నుంచి ఇస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కొన్ని సమస్యలతో ఆశించిన లాభాలు రాలేదని, ఈ సమస్యలను మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈనెల 4న హైదరాబాద్‌లో కేంద్ర సహకారశాఖ మంత్రి అమిత్‌షాను కలిసేందుకు తనకు అపాయింట్‌మెంట్‌ ఉందని, ఆయనను కలిసి ఇలాంటి సమస్యలను ఆయన ముందుంచుతానని రవీందర్‌రావు తెలిపారు. గౌరవ వేతనం పెంచాలని సభ్యులు కోరారు.  ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో కలిసి చర్చించి పెంచేందుకు కృషిచేస్తానని రవీందర్‌రావు హామీ ఇచ్చారు. కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ చల్మెడ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ సహకార సంఘాలు వ్యాపార సంస్థల మాదిరిగా  పంట రుణాలు, ధాన్యం కొనుగోళ్లపైనే ఆధారపడకుండా ఇతర వ్యాపార సేవా రంగాలను ఎంచుకోవాలని సూచించారు. రైతులకు డబ్బు సంపాదించే మార్గాలను సూచించాలని, వ్యవసాయంతోపాటు డెయిరీ, పౌలీ్ట్ర, చేపల పెంపకం వంటి రంగాల్లో రాణించేలా వారిని ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో బ్యాంకు వైస్‌ చైర్మన్‌,   మాజీ వైస్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రెడ్డి, డీజీఎం సత్యనారాయణరావు, సహకార బ్యాంకు అధికారులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:27:11+05:30 IST