ప్రతిపక్షాన్ని గౌరవించకపోవడం హేయం
ABN , First Publish Date - 2020-12-03T05:10:21+05:30 IST
శాసన సభలో ప్రతిపక్ష నాయకులను గౌరవించక పోవడం హేయమైన చర్య అని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత చౌదరి నారాయణమూర్తి (బాబ్జి ) అన్నారు.
టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి
శ్రీకాకుళం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): శాసన సభలో ప్రతిపక్ష నాయకులను గౌరవించక పోవడం హేయమైన చర్య అని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత చౌదరి నారాయణమూర్తి (బాబ్జి ) అన్నారు. బుధవారం ఆయన జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును చూసి, ప్రజలు ప్రభుత్వాన్ని అసహ్యహించుకుటున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు హుందాగా వ్యవహరించారు. కానీ, జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష నాయకులను రౌడీలా హెచ్చరించడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చాలా దిగజారుడు భాషలో మాట్లాడుతున్నారు. మేము కూడా వైసీపీ నేతల గురించి ఆ విధంగా మాట్లాడగలం. వైసీపీకి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం. ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి, మీరు కూడా గౌరవాన్ని కాపాడుకోవాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు అధికార పార్టీ నాయకులు హుందాగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులను దుర్భాషలు ఆడితే చూస్తూ ఊరుకొనేది లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క శాశ్వత అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు.’ అని బాబ్జి ఆరోపించారు. సమావేశంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ సింతు సుధాకర్, నాయకులు ఎం.రమేష్, మోహన్, విజయరామ్, వి.సూరిబాబు పాల్గొన్నారు.