ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదినం
ABN , First Publish Date - 2021-07-25T06:34:33+05:30 IST
టీఆర్ఎస్ నా యకులు, ప్రజాప్రతిని ధులు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వ హించారు.
- వాడవాడలా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు
సరిసిల్ల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ నా యకులు, ప్రజాప్రతిని ధులు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వ హించారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ ల్లోని వాడవాడలా మొక్కలు నాటారు. సిరిసిల్ల గాంధీచౌక్ వద్ద భారీ కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అధిక వర్షాల వల్ల ఇండ్లు దెబ్బతిన్న వారికి టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం, నగదును అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని వార్డుల్లో మొక్కలు నాటారు. జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో సయ్యద్ షాదాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిందం కళచక్రపాణి ప్రారంభించగా 45 మంది రక్తదానం చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో లక్ష మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మొక్కలు నాటారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ కోనరావుపేట మండలం మరిమడ్లలో, ముస్తాబాద్ మండలంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావులు మొక్కలు నాటారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఎస్పీ రాహూల్హెగ్డే, సిరిసిల్ల సర్ధాపూర్లో 17వ బెటాలియన్ కమాండెంట్ అలెక్స్ , ఎక్సైజ్ ఆధ్వర్యంలో పెద్దూర్ ఎల్లమ్మ దేవాలయం వద్ద మొక్కలు నాటారు. సిరిసిల్ల వేంకటేశ్వర దేవాలయం వద్ద ఈవో శ్రీనివాస్ మొక్కలు నాటారు. జిల్లా గ్రంథాలయం సంస్థ వద్ద కేటీఆర్ చిత్రపటానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, కళాకారులు క్షీరాభిషేకం చేశారు. ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పేరుగా నిలబడి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ముస్తాబాద్లో టీఆర్ఎస్వీ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి, వీర్నపల్లి, గంభీరావుపేట, బోయినపల్లి, వేములవాడ రూరల్, మండలాల్లో విభిన్న రీతిలో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుల్కం రాజు, సీనియర్ టీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్రెడ్డి తదితరులు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు హైదరాబాద్లోని తన నివాసంలో మొక్క నాటారు.