హైదరాబాద్ ఫార్మా కంపెనీలో ఐటీ సోదాలు
ABN , First Publish Date - 2021-03-02T07:13:01+05:30 IST
హైదరాబాద్కు చెందిన ఓ ఫార్మా కంపెనీకి సంబంధించి లెక్కల్లో చూపని రూ.400 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ గుర్తించిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది
న్యూఢిల్లీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్కు చెందిన ఓ ఫార్మా కంపెనీకి సంబంధించి లెక్కల్లో చూపని రూ.400 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ గుర్తించిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత నెల 24న 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఉన్న ఆ కంపెనీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.1.66 కోట్ల నగదును జప్తు చేయడంతోపాటు ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. అలాగే బోగస్ సంస్థలు, లేని సంస్థల నుంచి కొనుగోళ్లు చేసినట్లున్న పత్రాలు, కృత్రిమంగా సృష్టించిన ఖర్చుల వివరాలు, బైప్రొడక్ట్ విక్రయాలను తక్కువ చేసి చూపిన రశీదులు వంటివి లభ్యమయ్యాయని వివరించింది.