ఇది ప్రేక్షకుల విజయం
ABN , First Publish Date - 2022-05-17T06:04:33+05:30 IST
సర్కారువారి పాట చిత్రం పై ప్రజల అభిమానాన్ని తాను ఎన్నటికీ మర్చిపోలేనని, ఇది ప్రేక్షకులు విజయమని సినీ నటుడు మహేష్బాబు అన్నారు.
‘సర్కారువారి పాట’ విజయోత్సవ సభలో మహేష్బాబు
కర్నూలు (కల్చరల్), మే 16: సర్కారువారి పాట చిత్రం పై ప్రజల అభిమానాన్ని తాను ఎన్నటికీ మర్చిపోలేనని, ఇది ప్రేక్షకులు విజయమని సినీ నటుడు మహేష్బాబు అన్నారు. సోమవారం రాత్రి నగరంలోని ఎస్టీబీసీ కళాశాల క్రీడామైదానంలో ఇటీవల విడుదల అయిన సర్కారువారి పాట చిత్రం విజయోత్సవ సభ నిర్వహించారు. తొలిసారిగా కర్నూలులో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు హాజరైన మహేష్బాబును చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి హీరో మహేష్బాబు మాట్లాడుతూ కరోనా సమయంలో మొదలెట్టిన ఈ చిత్రం పూర్తి చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. కానీ చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ ఆ కష్టాలన్నీ మర్చిపోయేలా చేసిందని అన్నారు. ఈ చిత్రం చూసిన తమ తండ్రి హీరో కృష్ణ తన చిత్రాలు పోకిరి, దూకుడు కన్నా ఇది పెద్ద హిట్టవుతుందని చెప్పారని అన్నారు. ఒక్కడు షూటింగ్ జరుగుతున్నప్పుడు కర్నూలుకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం కర్నూలులో సర్కారువారి పాట ఫంక్షన్ చేద్దామని అనుకున్నామని.. ఇంతమంది ప్రేక్షకులు వస్తారని ఊహించలేదని చెప్పారు. ఇది సక్సెస్ మీట్లా లేదని, వంద రోజుల ఫంక్షన్ను తలపిస్తోందని అన్నారు. ఫంక్షన్లు రాయలసీమలోనే జరగాలన్నట్లుగా అభిమానులు వచ్చారని అన్నారు. ఈ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి చూశానని చెప్పారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు పరశురామ్కు దక్కుతుందని, తన పాత్రను అంత గొప్పగా మలిచారని అభినందించారు. అభిమానులు ఇచ్చిన విజయాన్ని గుండెల్లో దాచుకుంటానని చెప్పారు. తనకు నచ్చిన క్యారెక్టర్లలో ఒకటి ఈ చిత్రంలోనిదని, బాగా కొత్తగా ఫీలయి చేశానని అన్నారు. చిత్ర దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ కర్నూలుతో తనకు దగ్గరి సంబంధం ఉందని అన్నారు. ఒక్కడు చిత్రం చూసి స్ఫూర్తి పొంది... ఈ చిత్రం తీసి, కర్నూలులో విజయోత్సవ సభ జరుపుకోవడం లైఫ్టైమ్ గిఫ్ట్గా ఫీలవుతున్నానని చెప్పారు. ప్రత్యేకంగా మహేష్బాబు కోసమే డైలాగ్స్ రాసిపెట్టుకొని సినిమా తీశామని అన్నారు. ఈ చిత్రం అద్బుతంగా తీర్చిదిద్దిన టీమ్ సభ్యులకు, చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ప్రేక్షకులను ఈ చిత్రంలోని పాటలన్నీ రంజింపజేశాయని అన్నారు. ఈ సభ ప్రారంభానికి ముందు చిత్రంలోని పాటలకు సత్య మాస్టర్ బృందం ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. యాంకర్ శ్యామల ఈ చిత్రంలోని వివిధ సందర్భాలను, సన్నివేశాలను, వివరిస్తూ ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. చిత్ర నిర్మాతలు నవీన్ యర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, వివిధ జిల్లాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. ఈ వేడుకలో మహేష్ నృత్యం చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
సాగర్తో సీమకుఅన్యాయం
రాయలసీమ హక్కుల కోసం గళం విప్పాలి
సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల టౌన్, మే 16 : కేంద్ర ప్రభుత్వం 1951లో అనుమతించిన కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టును సిద్ధేశ్వరం వద్ద నిర్మించకుండా, నందికొండ వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం నిర్మించడం వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని సీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. మే 31న జరగనున్న సిద్ధేశ్వరం జలదీక్ష విజయవంతం కోసం నంద్యాల పట్టణ ప్రముఖులతో సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మిస్తే సీమ అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో వేలాది మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని అన్నారు. రైతుల త్యాగాలను గుర్తించి వారి అభివృద్ధికి పాటుపడాల్సిన ప్రభుత్వాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారిని ఆదుకున్న పాపాన పోలేదని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం కోల్పోయిన వేలాది మంది రైతులు ప్రస్తుతం దీనావస్థలో జీవిస్తున్నారని అన్నారు. దశాబ్దాలుగా సాగు, తాగునీటిలో రాయలసీమకు అన్యాయం జరుగుతున్నదని అన్నారు. రాయలసీమలో నిర్మాణంలో ఉన్న హంద్రీ - నీవా, గాలేరు - నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, సిద్ధాపురం ఎత్తిపోతల పథకాలు, ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టులకు ఏపీ రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొన్నదని, అయితే రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏర్పడిన కృష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్లో ఈ ఏడింటిని అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొనడం రాయలసీమకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నదని అన్నారు. ఏడు దశాబ్దాల పోరాటాల ఫలితమైన ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంటే రాయలసీమ నాయకులు, పార్టీలు తమకేమి సంబంధం లేనట్లు వ్యవహరించడం అన్యాయమని అన్నారు. రాయలసీమలో నాలుగు ప్రధాన పార్టీలకు అధినేతలు ఉన్నా ఈ అన్యాయంపై మౌనంగా ఉన్నారని అన్నారు. రాయలసీమ చట్టబద్ధ నీటి హక్కుల సాధన కోసం మేధావులు గళం విప్పాలని పిలుపునిచ్చారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో మే 31న నిర్వహించే జలదీక్షకు అన్నివర్గాల ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైౖర్మన్ డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, ఆంధ్రబ్యాంకు రిటైర్డ్ ఏజీఎం శివనాగిరెడ్డి, డాక్టర్ మధుసూదన్రావు, డాక్టర్ హరినాథ్రెడ్డి, వివిధ వర్గాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు.
అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రారంభోత్సవం
అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి
అధికారులు పారదర్శకంగా పని చేయాలి
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
కర్నూలు(న్యూసిటీ), మే 16: రాష్ట్ర వ్యాప్తంగా అనధికార లేఅవుట్లు ఎక్కువగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం సుంకేసుల రోడ్డులోని నూతన కౌన్సిల్ హల్లో కార్పొరేటర్లు, అధికారులతో కమిషనర్ ఏ. భార్గవతేజ అధ్యక్షతన మంత్రి ముఖాముఖి నిర్వహించారు. కలెక్టర్ పి. కోటేశ్వరరావు, నగర మేయర్ బీవై. రామయ్య, పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, హఫీజ్ఖాన్, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక హాజరయ్యారు. అంతకుముందు 2వ వార్డు ఎర్రబురుజు పెద్దమార్కెట్ సమీపంలో, 6వ వార్డు గడ్డ వీధిలో ఒక్కొక్కటి కోటి రూపాయలతో నిర్మించిన నూతన అర్బన్ హెల్త్ సెంటర్లను ఎంపీ డా.సంజీవ్కుమార్, ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నెలరోజుల్లో 180 ఫైళ్లను పరిశీలించానని అన్నారు. అందులో 50 ఫైళ్లు విజిలెన్సు, అవినీతి, ఏసీబీ అధికారులకు సంబంధించినవి ఉన్నాయన్నారు. అధికారులు, ఉద్యోగులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లేఅవుట్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ఆక్రమణలు, అక్రమాలపై చర్యలు తీసుకోడానికి వెనకాడవద్దని ఆయన సూచించారు. కార్పొరేటర్లు అభివృద్ధి విషయంలో అధికారులపై ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని హితవు పలికారు. నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్పొరేటర్లు వార్డులలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిలో వాణిజ్య సముదాయాలను నిర్మించడం ద్వారా కార్పొరేషన్కు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు సోంపల్లి క్రిష్ణకాంత్రెడ్డి, గాజుల శ్వేతారెడ్డి, ఆర్షియా పర్వీన్, కార్పొరేటర్లు విక్రమసింహారెడ్డి, జీఎల్వి. సుజాత, గాజుల శ్వేతారెడ్డి, రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సుందర నగరంగా తీర్చిదిద్దుతాం
కల్లూరు: కర్నూలును సుందర నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం 36వ వార్డు ఉల్చాల వై రోడ్డు జంక్షన్ను రూ.9.04 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవకుమార్, పాణ్యం, కోడుమూరు, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, జె.సుధాకర్, హఫీజ్ఖాన్, మేయర్ బీవై రామయ్య, నగర పాలక కమిషనర్ భార్గవ్తేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా మున్సిపల్ నిధులు రూ.9.04 కోట్లతో ఆరు వార్డులలో డ్రైనేజీలు, పార్కులకు ప్రహరీలు, రోడ్లు నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
బంగారం దొంగల అరెస్టు
స్టూవర్టుపురం, అంతర్రాష్ట్ర దొంగల రిమాండ్
రెండు ఘటనల్లో 26 తులాల బంగారు స్వాధీనం
బనగానపల్లె, మే 16: బనగానపల్లె పట్టణంలో వేర్వేరు దొంగతనాల కేసుల్లో నిందితులైన స్టూవర్టుపురం దొంగలను, అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.5.40 లక్షల విలువ చేసే 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నట్లు డోన్ డీస్పీ శ్రీనివాసరెడ్డి విలేఖర్లకు వెల్లడించారు. సోమవారం బనగానపల్లె పోలీస్స్టేషన్లో బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు రామిరెడ్డి, శంకర్నాయక్లతో డీఎస్పీ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఏప్రిల్ నెల 27వతేదీన పెద్దముడియం మండలం పాలూరు గ్రామానికి చెందిన నిహారిక బనగానపల్లెలో జమ్మలమడుగు వెళ్లేందుకు బస్సెక్కిందన్నారు. ఆమె పక్కనే కూచున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు మహిళలు ఆమె బ్యాగులోని రూ. 3.60లక్షల విలువ గల 12 తులాల బంగారును చోరీ చేశారన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి విశాఖపట్నంకు చెందిన రావుల ఎల్లారమ్మ, తూర్పుగోదావరికి చెందిన పోశమ్మ, దుర్గ, నంద్యాలకు చెందిన ఉషాకుమారిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి 12 తులాల బంగారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టి ఈ అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ముఠాపై రాష్ట్రంలోని నరసరావు పేట, గోస్పాడు, పాలకొల్లు, పాలకొల్లు, పెద్దకాకాని, గుడివాడ, ఒంగోలు తదితర పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.
స్ట్టూవర్టుపురం దొంగల అరెస్టు : బనగానపల్లె పట్టణంలో మరో బంగారు ఆభరణాల చోరీ కేసులో గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన దొంగలను అరెస్టు చేసి వారి వద్ద రూ.180 లక్షలు విలువ చేసే 6 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జమ్మలమడుగుకు చెందిన మెట్టుపల్లె స్వప్న ఈనెల 11న బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్లో జమ్మలమడుగు బస్సు ఎక్కిందన్నారు. స్టూవర్టుపురం దొంగలు అంజనమ్మ, ఏసుబాబు, లక్ష్మమ్మ, వెంకటలక్ష్మి బస్సులో ఎక్కి స్వప్న బ్యాగులోని రూ.1.80 లక్షల విలువ చేసే 6 తులాల బంగారాన్ని చోరీ చేశారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను బనగానపల్లె పట్టణంలో అదుపులోకి తీసుకొని వారి వద్ద 6 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో దొంగలను పట్టుకోవడంతో కృషి చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లకు డీఎస్పీ నగదు బహుమతి అందించారు.
సీపీఎ్సను రద్దు చేయాలి
8 నేడు పది స్పాట్ కేంద్రాల వద్ద నిరసన
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 16: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సీపీఎ్సను రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకా్షరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సలాంఖాన్ ఎస్టీయూ భవన్లో జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్. గోకారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం పదో తరగతి స్పాట్ కేంద్రాల వద్ద ఉదయం 9 గంటలకు సీపీఎ్సను రద్దు చేయాలని, జాతీయ విద్యావిధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్లో ఉన్న పీఆర్సీ జీవోలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.సుధాకర్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టికే జనార్దన్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఇస్మాయిల్, ఏపీటీఎఫ్257 జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రంగన్న, బీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్బాబు తదితరులు పాల్గొన్నారు.
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం: ఎస్పీ
నంద్యాల (నూనెపల్లె), మే 16 : జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ రఘువీర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నాటుసారా స్థావరాలపై, పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై దృష్టిసారించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు, సెబ్ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి 33 మందిని అరెస్టు చేసి 15కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 506 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని, 9400 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశామన్నారు. నాటుసారా తయారీకి వినియోగించే 250 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రౌడీషీటర్ల కదలికలపై నిఘా: ఎస్పీ
జిల్లాలోని రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచామని ఎస్పీ రఘువీర్రెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల మూడో పట్టణ పోలీసుస్టేషన్ ఆవరణలో జిల్లా కేంద్రంలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రఘువీర్రెడ్డి మాట్లాడుతూ రౌడీషీటర్లు సత్ ప్రవర్తనతో మెలగాలన్నారు.