జగన పాలనలో సామాన్యులు బతకడం కష్టం

ABN , First Publish Date - 2022-05-20T06:34:12+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి పాలనలో సామాన్యులు బతకడం కష్టంగా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు

జగన పాలనలో సామాన్యులు బతకడం కష్టం
చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్న మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి

 మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప

చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన

అనంతపురం, మే19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి పాలనలో సామాన్యులు బతకడం కష్టంగా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో... ఏర్పాట్లను పరిశీలించేందుకు చినరాజప్ప అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా... తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రెండోవిడతలో భాగంగా... ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. తమ నాయకుడు చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నా రన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు, విద్యుత చార్జీలు, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో... సామాన్య ప్రజలు ఒకపూట తిండితినలేని పరిస్థితిలో బతుకు వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా, అన్నా క్యాంటిన, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాము చేపట్టిన సంక్షేమ పథకాల న్నింటినీ పక్కకునెట్టి పేదోడి నోటికాడ ముద్దను దూరం చేసిందన్నారు. రాష్ట్రంలో అరాచకాలు మితిమీరిపోయాయ న్నారు. ప్రజలపై దాడులు జరుగుతున్నా... మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా... పోలీసులు చోద్యం చూస్తుండటం దారుణమన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.  చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో ప్రజల్లోకి వెళ్లాలని మొదట సీఎం భావించినా   ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టి అధికారులు, పోలీసులను వెంట తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పడంతోనే ఈ  పాలన ఎలా కొనసాగుతోందో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమమే నిదర్శనమన్నారు. మళ్లీ మంత్రులతో బస్సు యాత్ర చేయాలని జగన సంకల్పించారంటే... సీఎంకు ఎంత భయం పట్టుకుందో అర్థమవుతోందన్నారు. ప్రజలు ఓటేస్తారన్న ఆశ జగనకు లేకపోవడంతోనే మరోసారి మోసపు హామీలతో ప్రజల ముందుకొచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి జగన పాలనను విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. 


చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన...

మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరిలతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. తపోవనం సమీపంలోని వీవీఆర్‌ ఫంక్షనహాల్లో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


Updated Date - 2022-05-20T06:34:12+05:30 IST