నా హత్యకు జగన్ కుట్ర
ABN , First Publish Date - 2022-07-07T08:42:08+05:30 IST
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి తనను హత్య చేయడానికి కుట్రపన్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.
సహకరించిన స్టీఫెన్ రవీంద్ర: ఎంపీ రఘురామ
న్యూఢిల్లీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి తనను హత్య చేయడానికి కుట్రపన్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తన పట్ల పోలీసుల వ్యవహార శైలిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. ‘‘జగన్, స్టీఫెన్ రవీంద్రలు చిన్ననాటి స్నేహితులు. ఆయనను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించాలని జగన్ శతవిధాల యత్నించారు. ఇప్పుడు రవీంద్ర సహకారంతో, ఏపీ పోలీసుల అండదండలతో నన్ను చంపడానికి ప్రణాళిక రూపొందించారు. ‘ఈ నరహంతకుడు... పోలీ సు హంతకులతో కలిసి నాకేదైనా హాని తల పెడితే... ఏమి చేయాలన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని కోరుతున్నా’ అని అన్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. గత మూడేళ్లలో ‘సాక్షి’ పత్రికకు రూ. 300 కోట్ల విలువైన పత్రికా ప్రకటనలను ఇచ్చారని, జిల్లా ఎడిషన్లలో ప్రకటనలు వీటికి అదనమని తెలిపారు. ప్రభుత్వంతో ఏదైనా పని చేయించుకున్నవారు నేరుగా డబ్బు లివ్వలేకపోతే, వారితో జిల్లా ఎడిషన్లలో ప్రకటనలు ఇప్పించుకొని డబ్బులు సంపాదించారని చెప్పారు. ఇప్పుడు 3లక్షల మంది వలంటీర్లకు రూ.200 చొప్పున ప్రభుత్వ నిధులను కేటాయిం చి, ‘సాక్షి’ కొనుగోలు చేయించేలా ప్రణాళిక వేశారన్నారు.