విదేశాలకు జగన్ దంపతులు
ABN , First Publish Date - 2022-06-29T08:14:32+05:30 IST
విదేశాలకు జగన్ దంపతులు
2న పారిస్ లో కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి హాజరు... 3న తాడేపల్లికి రాక
అమరావతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా విదేశాలకు వెళ్లారు. మంగళవారం రాత్రి 7.30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. దావో్సలో గత నెలలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు కూడా జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఇప్పుడు అదే విమానంలో బయల్దేరిన వారికి పలువురు మంత్రులు, అధికారులు వీడ్కోలు చెప్పారు. సీఎం కుమార్తె హర్షారెడ్డి పారి్సలో చదువుతోంది. వచ్చే నెల రెండో తేదీన ఆమె చదువుతున్న కళాశాలలో జరిగే స్నాతకోత్సవంలో జగన్ దంపతులు పాల్గొంటారు. జూలై 3వ తేదీన తాడేపల్లికి తిరిగి చేరుకుంటారు.
విజయవాడలో ట్రాఫిక్ ఇక్కట్లు
జగన్ దంపతులు గన్నవరం విమానాశ్రయం వెళ్లే జాతీయ రహదారిపై విజయవాడ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ వైపు వాహనదారులు వెళ్లకుండా దాదాపు గంట సేపు నిరోధించారు. సర్వీసు రోడ్డులోనూ వాహనాలను అడ్డుకున్నారు. ముఖ్యంగా రామవరప్పాడు రింగ్ రోడ్డువైపు రాకుండా వాహనాలను ఆపేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. సీఎం వెళ్లున్నారని గంటల తరబడి నగరంలో ట్రాఫిక్ను నిలిపివేయడమేంటని మండిపడ్డారు.