జగన్ బలహీన నేత: గంటా
ABN , First Publish Date - 2022-04-15T01:43:00+05:30 IST
మంత్రివర్గ విస్తరణ తరువాత సీఎం జగన్ బలహీనమైన నాయకుడని తేలిపోయిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు.
విశాఖ: మంత్రివర్గ విస్తరణ తరువాత సీఎం జగన్ బలహీనమైన నాయకుడని తేలిపోయిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు బలమైన నాయకుడిగా జగన్కు రాష్ట్రంలో ఎదురులేదని చెప్పుకొచ్చారని, అయితే తాజా పరిణామాలతో అదంతా ఒట్టిదేనని స్పష్టమైందన్నారు. రెండున్నరేళ్ల తరువాత క్యాబినెట్ మొత్తం మార్చుతానని చెప్పిన జగన్, ఇప్పుడు 11 మంది పాత మంత్రుల్ని కొనసాగించి 14 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారని విమర్శించారు. అటువంటప్పుడు మొత్తం మంత్రులతో రాజీనామాలు ఎందుకు చేయించారని ప్రశ్నించారు. ఇంత హడావిడి చేసి ఎనిమిది జిల్లాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం బాధాకరమని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు.