
తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23వ తేదీన తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. 23వ తేదిన ఉదయం గన్నవరం నుంచి విమానంలో బయల్దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద నిర్మితమైన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పేరూరు నుంచి హెలికాప్టర్లో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వెళతారు. ఇనగలూరు వద్ద రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న అపాచి పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ఆ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆపై హెలికాప్టర్లో తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గాన విమానాశ్రయం పక్కనే శ్రీవెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్-1ను సందర్శిస్తారు. ఆ ప్రాంగణంలో టీసీఎల్ పరిశ్రమకు సంబంధించిన అనుబంధ యూనిట్ల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవన్నీ ముగించుకుని తిరిగి తిరుపతి విమానాశ్రయం చేరుకుని మధ్యాహ్నం 2.40 గంటలకు విమానంలో గన్నవరం బయల్దేరి వెళతారు.
ఇవి కూడా చదవండి